మళ్లీ 60,000 దిగువకు, 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
2022 కొత్త సంవత్సరం భారీ ఉత్సాహంతో పరుగెత్తిన స్టాక్ మార్కెట్లు నేడు (గురువారం, జనవరి 6) నష్టపోయాయి. వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. నిన్నటి వరకు సెన్సెక్స్ వరుసగా నాలుగు రోజులు లాభపడింది. ఈ నాలుగు రోజుల్లో దాదాపు 2500 పాయింట్ల వరకు లాభపడింది. అదే సమయంలో గత పన్నెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.20 లక్షల కోట్లు పెరిగింది. కానీ నేడు సెన్సెక్స్ 600 పాయింట్ల మేర క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలకు తోడు దిగ్గజరంగ షేర్లలో వెల్లువెత్తిన లాభాల స్వీకరణ మార్కెట్ సెంటిమెంటును దెబ్బకొట్టింది.
అందుకే నష్టాల్లో మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ నుండి అననుకూల సంకేతాలు భారత సూచీలను దెబ్బతీశాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం మన సూచీలపై పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం పెరిగింది.
ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. మహమ్మారి ఉధృతితో పలు ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు పెరుగుతున్నాయి. ఇది కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది ఆరంభం నుండి మార్కెట్లలో ర్యాలీ ఉంది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.
సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో...
సెన్సెక్స్ 59,731.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,781.86 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,290.58 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,768.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,797.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,655.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 621.31 (1.03%) పాయింట్లు ఎగిసి 59,601.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 179.35 (1.00%) పాయింట్లు లాభపడి 17,745.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
ఆటో, ఆయిల్ మినహా దాదాపు మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ సూచీలు ఒక శాతం వరకు క్షీణించాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, ఐచర్ మోటార్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్డబ్ల్యు స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, శ్రీ సిమెంట్స్, రిలయన్స్ ఉన్నాయి.