భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, దెబ్బతీసిన బ్యాంక్, మెటల్, ఫార్మా
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జూలై 8) భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న సరికొత్త గరిష్టాలని తాకిన మార్కెట్లు నేడు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ నష్టాలకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు బ్యాంకింగ్, మెటల్, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు పతనమయ్యాయి. దీంతో బుధవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 53వేల పాయింట్ల వద్ద ఆల్టైం గరిష్ఠాలను తాకిన ఆనందం ఒకేరోజులో ఆవిరైంది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 52,500 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 15,750 దిగువన క్లోజ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.71గా ఉంది. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగాలు దెబ్బతీశాయి.
సెన్సెక్స్ 53,065.69 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,103.03 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 52,428.84 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,855.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,885.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,682.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 485.82 (0.92%) పాయింట్లు నష్టపోయి 52,568.94 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 151.75 (0.96%) పాయింట్లు నష్టపోయి 15,727.90 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఐచర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యు స్టీల్, హిండాల్కో, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఎస్బీఐ, టీసీఎస్ ఉన్నాయి.