354 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, రెండు రోజుల్లో 1000 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న దాదాపు 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు మరో 350 పాయింట్లకు పైగా క్షీణించింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు వెయ్యి పాయింట్లు పతనమైంది. 53,000 పాయింట్ల దిశగా కనిపించిన సెన్సెక్స్ నేడు 52,200 పాయింట్ల దిగువకు చేరుకుంది. నిఫ్టీ కూడా నిన్న 170 పాయింట్లు, నేడు 120 పాయింట్లు పతనమైంది. రెండు రోజుల్లో దాదాపు మూడు వందల పాయింట్లు నష్టపోయింది.
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ, మెటల్, విద్యుత్, టెలికం, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ దశలో 52,013 వద్ద సెన్సెక్స్, 15,578 వద్ద నిఫ్టీ కనిష్టాలను తాకింది.
సెన్సెక్స్ 354.89 (0.68%) పాయింట్లు నష్టపోయి 52,198.51 పాయింట్ల వద్ద, నిఫ్టీ 120.30 (0.76%) పాయింట్లు నష్టపోయి 15,632.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, HUL, గ్రాసీమ్, మారుతీ సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.