రెండ్రోజుల్లో రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగింది, సెన్సెక్స్ 573 పాయింట్లు అప్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 4 మంగళవారం) భారీగా లాభపడ్డాయి. సూచీలు వరుసగా మూడో రోజు ఎగిసిపడ్డాయి. 2021 క్యాలెండర్ ఏడాదిలో చివరి రోజైన గత శుక్రవారం మార్కెట్లు పరుగు తీశాయి. నాడు సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడింది. జనవరి 1, 2 తేదీలు మార్కెట్కు సెలవు. నిన్న 3వ తేదీ.. కొత్త క్యాలెండర్ ఏడాది మొదటి సెషన్లో సెన్సెక్స్ 930 పాయింట్లు లాభపడింది. నేడు దాదాపు మరో 700 పాయింట్లు ఎగిసింది. ఈ వరుస రెండు సెషన్లలో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా, మూడు సెషన్లలో 2100 పాయింట్ల వరకు లాభపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగానే పెరిగింది.
రూ.5 లక్షల కోట్ల సంపద
నిన్న, నేడు.. రెండు సెషన్లలో సెన్సెక్స్ వరుసగా 930 పాయింట్లు, 672 పాయింట్లు లాభపడింది. రెండు సెషన్లలో 1600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు పెరిగింది. 2022 క్యాలెండర్ ఏడాది తొలి సెషన్ (నిన్న డిసెంబర్ 3 సోమవారం) ఇన్వెస్టర్ల సంపద రూ.350 లక్షల కోట్ల వరకు పెరిగింది. దీంతో నిన్నటి వరకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.69 లక్షల కోట్లు క్రాస్ చేసింది. నేడు మరింత ఎగిసి రూ.2.70 లక్షల కోట్లు దాటింది.
ఈ స్టాక్స్ రాణించాయి
నేడు సెషన్ ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ తిరిగి పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీల పరుగుకు కారణమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నేడు ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. థర్డ్ క్వార్టర్ ఫలితాలు రానున్న నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్, టీసీఎస్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, HUL వంటి షేర్లు రాణించాయి.
సెన్సెక్స్, నిఫ్టీ
సెన్సెక్స్ నేడు ఉదయం 59,343.79 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,937.33 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,084.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,681.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,827.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,593.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా మాత్రమే నష్టపోయాయి. ఎన్టీపీసీ ఏకంగా 5.56 శాతం లాభపడింది. ఎస్బీఐ, పవర్ గ్రిడ్, టైటాన్, రిలయన్స్ రెండు శాతానికి పైగా ఎగిశాయి. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.