సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్, నిన్నటి నష్టంలో సగం రికవరీ
స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 1100 పాయింట్ల వరకు లాభపడినప్పటికీ, ఆ తర్వాత స్వల్పంగా క్షీణించి దాదాపు 500 పాయింట్ల లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 56,320.02 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,900.74 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,047.22 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,773.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,936.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,688.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 497.00 (0.89%) పాయింట్లు లాభపడి 56,319.01 పాయింట్ల వద్ద, నిఫ్టీ 156.65 (0.94%) పాయింట్లు ఎగిసి 16,770.85 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్లు గత రెండు సెషన్లలో భారీగా నష్టపోయాయి. నిన్న సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్ల వరకు నష్టపోయింది. నేడు 500 పాయింట్ల మేర లాభపడింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా దిగ్గజరంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. దీంతో ఈ రోజు ట్రేడింగ్లో బుల్ పరుగులు పెట్టింది. ఓ దశలో భారీలాభాల్లో దూసుకు వెళ్లింది. చివరలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లు కాస్త తడబడి, చివరకు 500 పాయింట్ల లాభాల్లో ముగిశాయి.
ఐటీ, మెటల్, రియాల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ట్రేడింగ్ ఉత్సాహంగా కనిపించింది. మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీ, లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. రియల్టీ, ఫార్మా, ఎనర్జీ, ఐటీ, లోహ రంగ సూచీలు 1 శాతం నుండి 3 శాతం మేర పెరిగాయి.