పైకి లాగిన ఐటీ, దెబ్బకొట్టిన రిలయన్స్, బ్యాంకులు! బలహీనపడిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 3) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రానికి నష్టపోయాయి. సెన్సెక్స్ మధ్యాహ్నం నుండి నేల చూపులు చూసింది. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయింది. మళ్ళీ పుంజుకుంటున్నట్లు కనిపించినా చివరకు నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ 95.09 పాయింట్లు లేదా 0.24% నష్టపోయి 38,990.94 వద్ద, నిఫ్టీ 7.50 పాయింట్లు లేదా 0.07% పడిపోయి 11,527.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1452 షేర్లు లాభాల్లో, 1199 షేర్లు నష్టాల్లో ముగియగా, 176 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
ఆ టైంలో 1.7 కోట్ల ఉద్యోగాలు పోయాయి: అర్బన్ జాబ్స్.. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం
టాప్ గెయినర్స్.. లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసీమ్, టైటాన్ కంపెనీ, యూపీఎల్, విప్రో ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా ఉన్నాయి. అమెజాన్, వెరిజోన్ పెట్టుబడులు పెడుతుందనే వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 30 శాతం ఎగిసి రూ.12 దాటింది. ఐటీ, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్, మెటల్ రంగాలు ఒత్తిడికి లోనయ్యాయి.
టెల్కోలు జూమ్
మిడ్ క్యాప్ షేర్లు దాదాపు 1 శాతం ఎగిసిపడ్డాయి. ఐటీ స్టాక్స్ కారణంగా మార్కెట్లు పుంజుకోగా, రిలయన్స్, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ వంటివి లాభాలను కిందకు దించాయి. ఆగస్ట్ నెలలో వెహికిల్ సేల్స్ పెరగడంతో ఆటో షేర్లు భారీగా లాభపడ్డాయి. టెల్కోలకు బకాయిలు చెల్లించేందుకు పదేళ్ల గడువు ఇవ్వడం కలిసి వచ్చింది. దీంతో ఈ రంగం షేర్లు లాభపడ్డాయి. గ్రాసిమ్, టైటాన్, యూపీఎల్, విప్రో, టెక్ మహీంద్రా, నెస్లే, ఐచర్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ టాటా మోటార్స్ లాభపడ్డాయి.
బలహీనపడిన రూపాయి
డాలర్ మారకంతో రూపాయి 73.47 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు రూపాయి 44 పైసలు లేదా 0.60 శాతం క్షీణించింది. 73.21 నుండి 73.48 మధ్య ట్రేడ్ అయింది. గత నెలలో 76.91 వద్ద ట్రేడ్ అయిన రూపాయి అప్పటితే పోలిస్తే 4 శాతానికి పైగా రికవరీ అయింది. ఇదిలా ఉండగా, నగదు విభాగంలో నిన్న FPIలు దాదాపు రూ.991 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ DIIలు రూ.657 కోట్లకు పైగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం FPIలు రూ.486 కోట్లని ఇన్వెస్ట్ చేయగా, DIIలు రూ.775 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.