భారీ లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి మార్కెట్లు: పేటీఎం షేర్లు మరింత పతనం
స్టాక్ మార్కెట్లు బుధవారం (మార్చి 23) నష్టాల్లో ముగిశాయి. ఉదయం 200 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం గం.12.00 వరకు లాభాల్లోనే కనిపించినప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 58,198.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,416.56 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,568.59 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 304 పాయింట్లు నష్టపోయి 57,684 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 17,245 పాయింట్ల వద్ద ముగిసింది.
హెల్త్ కెర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు లాభాల్లో ముగియగా, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్లో 13 స్టాక్స్ లాభపడగా, 17 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, టాటా స్టీల్, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC, కొటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, సిప్లా ఉన్నాయి.
అమెరికాలో వార్షిక ద్రవ్యోల్భణం 6.2 శాతంగా నమోదయింది. ఇది మూడు దశాబ్దాల గరిష్టం. పేటీఎం షేర్లు ఈ రోజు 4 శాతం నష్టపోయి ఆల్ టైమ్ కనిష్టం రూ.522కి పడిపోయాయి. ఇష్యూ ధర నుండి ఈ షేర్ ఇప్పటికీ 75 శాతం క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32.62 వేల కోట్లు క్షీణించి రూ.2.59 లక్షల కోట్లకు చేరుకుంది.