1000 పాయింట్లు పతనమై, 600 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్: ప్రాఫిట్ బుకింగ్తో నష్టాల్లో క్లోజ్
స్టాక్ మార్కెట్లు మంగళవారం (సెప్టెంబర్ 28) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం ఓ సమయంలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్, చివరి గంటలో కాస్త కోలుకొని, భారీ నష్టాలను తప్పించుకుంది. చివరకు 400 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగిసింది. గతవారం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ గతవారం వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. గత గురువారం ఒక్కరోజే వెయ్యి పాయింట్లు ఎగిసింది.
దీంతో శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్తో నష్టాల్లోకి వెళ్తుందని భావించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో లాభాల్లో ముగిశాయి. దీంతో ఈ వారం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఇందుకు సంకేతంగా నిన్న మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. నేడు నష్టాల్లోకి వెళ్లాయి.
కనిష్టం వద్ద కొనుగోళ్లతో కాస్త పైకి
సెన్సెక్స్ మధ్యాహ్నం సమయంలో దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. నేటి కనిష్టం నుండి 600 పాయింట్లకు పైగా పైకి ఎగిసింది. ఉదయం 60,285.89 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, 60,288.44 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,045.53 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా ఓ దశలో 1.66 శాతం మేర కుంగిపోయింది. అయితే కనిష్టం వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. కానీ పూర్తిస్థాయిలో లాభాల్లోకి రాలేదు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. గతవారం సెన్సెక్స్ 60,000 పాయింట్లతో చారిత్రాత్మక రికార్డుకు చేరుకుంది.
దీంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో, కనిష్టం వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొని, చివరలో కాస్త పైకి లేచింది. అయినప్పటికీ నష్టాల్లోనే ముగిసింది. రియాల్టీ, ఐటీ, మీడియా, సర్వీస్, ఫైనాన్షియల్, ఆటో రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫ్యూయల్, బ్యాంకింగ్, కమోడిటీస్, మెటల్, ఫార్మా రంగాల షేర్ల సూచీలు లాభపడ్డాయి.
ఈ సూచీలు జంప్
సెన్సెక్స్ 30లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టైటాన్, కొటక్ మహీంద్రా బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, రిలయన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగతా స్టాక్స్ నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, రియాల్టీ సూచీలు 2 శాతం నుండి మూడు శాతం ఎగిశాయి. పవర్, ఆయిల్, గ్యాస్, మెటల్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణంగా ప్రాఫిట్ బుకింగ్. ఆ తర్వాత చమురు ధరలు పెరగడం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్ 80 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది మూడేళ్ల గరిష్టం. భారత్ క్రూడాయిల్ దిగుమతుల్లో 70 శాతం ఉన్నాయి. యూఎస్ ఫెడ్ సమావేశం, చైనా ఎవర్ గ్రాండ్ డెవలప్మెంట్స్, చమురు ధరల పెరుగుదల, బాండ్ దిగుబడుల వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలు. మరోవైపు, సెప్టెంబర్ క్వార్టర్ ఎర్నింగ్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉన్నారు. ఇక, డాలర్ మారకంతో రూపాయి ఒక నెల కనిష్టానికి పడిపోయింది.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా
ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. ఎవర్ గ్రాండ్, చైనాలో విద్యుత్ కొరత సూచీలను కలవరపెట్టాయి. మరోవైపు బ్రిటన్లో ఇంధన కొరత, చైనాలో పరిస్థితుల దృష్ట్యా ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో కదలాడాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ పరిణామాలు నేటి ట్రేడింగ్లో దేశీయ సూచీల సెంటిమెంటను ఇంకాస్త దెబ్బతీశాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఐవోసీ, బీపీసీఎల్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.