ఈ వారం 1200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, ఈ స్టాక్స్ మాత్రం జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. గతవారం 60,000 పాయింట్లను దాటిన సెన్సెక్స్, ఈ వారం 59,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ వారంలో సోమవారం ఒక్కరోజే అతి స్వల్ప లాభాలలో ముగిసింది. తర్వాత వరుసగా నష్టపోయింది. ప్రారంభ సెషన్ సోమవారం సెన్సెక్స్ 29.41 (0.049%) పాయింట్లు లాభపడి 60,077.88 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు సెషన్లు నష్టపోయింది. మంగళవారం 410 పాయింట్లు, బుధవారం 254.33 (0.43%) పాయింట్లు, గురువారం (నిన్న) 286 పాయింట్లు పతనమైంది.
నేడు(శుక్రవారం) మరో 360 పాయింట్లు పతనమైంది. గతవారం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. ఈ వారం మాత్రం దాదాపు 1300 పాయింట్ల వరకు నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ వారం 1,282.89 పాయింట్లు (2.13 శాతం) నష్టపోయి 58,765.58 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
భారీ నష్టాల్లో....
సూచీలు నేడు (అక్టోబర్ 1 శుక్రవారం) ఆద్యంతం నష్టాల్లో కొనసాగాయి. దీంతో వరుసగా నాలుగో రోజూ సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీల స్థిరీకరణ మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఐరోపా మార్కెట్ ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒక్క షాంఘై కాంపోజిట్ మినహా ఆసియా-పసిఫిక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, టెక్, టెలికాం, ఆర్థిక రంగాల్లో స్థిరీకరణ కొనసాగుతోంది.
అలాగే, కొన్ని రోజులుగా మార్కెట్లో చమురు ధర పెరుగుతోంది. అలాగే సహజవాయువు, సీఎన్జీ, ఎల్పీజీ ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్భణం భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల అనేక రంగాలపై ప్రతికూల ప్రభావంపడే అవకాశముందనే సంకేతాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను కలవరపెడుతోంది. రాబోయే పరపతి విధాన సమీక్షలో రివర్స్ రెపో రేటును ఆర్బీఐ సవరించే అవకాశముందని సిటీ గ్రూప్ అంచనా వేయడం దేశీయంగా ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు నష్టాలు నమోదు చేశాయి.
నష్టాల్లో ముగింపు
సెన్సెక్స్ నేడు 58,889.77 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,890.08 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,551.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 360.78 (0.61%) పాయింట్లు నష్టపోయి 58,765.58 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,531.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,557.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,452.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 86.10 (0.49%) పాయింట్లు నష్టపోయి 17,532.05 పాయింట్ల వద్ద ముగిసింది.
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 11 పైసలు లాభపడి 74.12 వద్ద క్లోజ్ అయింది.
ఈ స్టాక్స్ జంప్
ఈ వారం సూచీలు నష్టపోయాయి. కానీ కొన్ని స్టాక్స్ మాత్రం భారీగా ర్యాలీ చేశాయి. పలు స్టాక్స్ పదిహేను శాతం లాభపడ్డాయి. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ 185 శాతం, డైనమిక్ ప్రోడక్ట్స్ 19.99 శాతం, ఆల్కాలీ మెటల్స్ 19.99 శాతం, వినైల్ కెమికల్స్ 19.99 శాతం, మార్టిన్ బర్న్ 19.81 శాతం, ఉపాసన ఫైనాన్స్ 18.37 శాతం, శీతల్ కూల్ 18.18 శాతం, జీటీపీఎల్ హాత్ వే 15.29 శాతం, ఆకాష్దీప్ మెటల్ 15.27 శాతం నష్టపోయాయి.