నష్టాల నుండి లాభాల్లోకి: RBI బ్యాంకుతో ఆ బ్యాంకుకు ఊరట, ఐనా 18% డౌన్
స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 27) లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. మెటల్ మినహా మిగతా రంగాలు అన్ని కూడా లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా ఫార్మా స్టాక్స్ ఒక శాతం మేర లాభపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాభాల్లో ముగిసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వెంటాడాయి. అయినప్పటికీ కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు గతవారం స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
నష్టాల నుండి లాభాల్లోకి
సెన్సెక్స్ ఉదయం 56,948.33 పాయింట్ల వద్ద దాదాపు 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. కానీ కాసేపటికే కోలుకున్న సూచీలు ఉదయం గం.11 నుండి లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ప్రారంభంలోనే కాస్త తడబడ్డాయి. మధ్యాహ్నం నుండి క్రమంగా లాభపడిన సూచీలు చివరకు 200 పాయింట్లకు పైగా ఎగిసింది. సెన్సెక్స్ 57,512.01 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,543.08 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 295.93 (0.52%) పాయింట్లు ఎగిసి 57,420.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 82.50 (0.49%) పాయింట్లు లాభపడి 17,086.25 పాయింట్ల వద్ద ముగిసింది.
తడబడి.. నిలబడి
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఇన్వెస్టర్లు తొలుత కాస్త అప్రమత్తంగా వ్యవహరించారు. అయినప్పటికీ కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా కోలుకోవడం సూచీలకు కలిసి వచ్చింది. దేశంలో బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన అదనపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, ఓఎన్జీసీ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంకు, గ్రాసీమ్ ఉన్నాయి.
ఆర్బీఐ ప్రకటనతో ఊరట
ఆర్బీఎల్ బ్యాంకు స్టాక్స్ నేడు భారీగా నష్టపోయాయి. ఈ స్టాక్ ధర నేడు ఏకంగా 18 శాతం నష్టపోయి రూ.141 వద్ద ముగిసింది. ఓ దశలో 52 వారాల కనిష్టం రూ.130కి పడిపోయింది. అయితే బ్యాంకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని ఆర్బీఐ ప్రకటించడంతో కాస్త కోలుకున్నది. ఆర్బీఎల్ బ్యాంకు ఎండీ, సీఈవో విశ్వవీర్ అహుజా బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో తాత్కాలికంగా రాజీవ్ అహుజా నియమితులయ్యారు. బ్యాంకు జనరల్ మేనేజర్ యోగేష్ కే దయాల్ను బోర్డులో అదనబు డైరెక్టర్గా నియమించింది ఆర్బీఐ. దీంతో ఆర్బీఎల్ బ్యాంకులో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతాయనే సంకేతాలు కనిపించి స్టాక్ నష్టపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఆర్బీఐ ప్రకటనతో ఊరట దక్కింది.