2008 తర్వాత తొలిసారి.. కరోనా భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1450 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో ఈ వారమంతా మార్కెట్లు నష్టాలనే చవి చూశాయి. భారత్, ఆసియా, ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 1,071.62 పాయింట్లు (2.70 శాతం) నష్టపోయి 38674.04 వద్ద, నిఫ్టీ 319.80 పాయింట్లు (2.75 శాతం) నష్టపోయి 11313.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత సెన్సెక్స్ 11,00 పాయింట్లకు పైగా కూడా నష్టపోయింది. 110 షేర్లు లాభాల్లో ఉండగా, 873 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 31 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.సాయంత్రం మార్కెట్లు క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 1,448.37 పాయింట్లు నష్టపోయి 38,297.29 వద్ద, నిఫ్టీ 431.55 పాయింట్లు దిగజారి 11,201.75 వద్ద స్థిరపడింది. ఓ దశలో సెన్సెక్స్ 1,525 పాయింట్లు కూడా నష్టపోయింది. నిఫ్టీలో ఐవోసీ ఒక్కటే లాభపడింది..
భారీ నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు
డాలరుతో రూపాయి మారకం విలువ 71.66 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన నాస్డాక్ 3.7 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 3.3 శాతం, ఇటలీ మార్కెట్లు 6 శాతం మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు తీవ్ర నష్టాలను మూటకట్టుకున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
2008ఆర్థిక మాంద్యం తర్వాత మళ్ళీ ఇదే
2008 ఆర్థిక మాంద్యం అనంతరం ప్రపంచ మార్కెట్లు వరుసగా వారం రోజులు ఇంతలా నష్టపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 42వేల దరిదాపుల్లో ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 38 వేలకు దిగజారింది. అంటే వారంలో రోజుల్లో ఏకంగా 4వేలకు పైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీది అదే దారి.12వేల కంటే ఎక్కువగా ఉన్న నిఫఅటీ 11,300కు దిగజారింది.
అన్ని రంగాల షేర్లు నష్టాల్లో
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, వేదాంత, జేఎస్డబ్ల్యూ ఉన్నాయి. కోల్ ఇండియా, హిండాల్కో, సెయిల్, జిందాల్ స్టీల్, ఎన్ఎండీసీ.. ఇలా అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.