భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ సరికొత్త గరిష్టానికి
ముంబై: స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. కొద్ది రోజులుగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో నెమ్మదించిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (సెప్టెంబర్ 15, బుధవారం) పరుగులు పెట్టాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను క్షీణించలేదు. పైగా అంతకంతకూ ఎగబాకి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. టెలికాం రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఆటో రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో ఆయా రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. అల్యూమినియం ధరలు దశాబ్ద గరిష్టానికి చేరుకోవడం కూడా మెటల్ రంగ షేర్లు పరుగులు పెట్టడానికి కారణమైంది. కోల్ ఇండియా ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఆ స్టాక్తో పాటు ఎన్టీపీసీ ర్యాలీ చేశాయి. రిటైల్ ద్రవ్యోల్భణం క్షీణత, వ్యాక్సినేషన్ వేగవంతం, మరిన్ని వ్యాక్సీన్లు అందుబాటులోకి రావడం, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం కలిసి వచ్చింది.
సెన్సెక్స్ నేడు ఏకంగా 476 పాయింట్లు లాభపడింది. ఉదయం 58,354.11 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 58,777.06 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,272.82 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,387.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,532.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,386.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 476.11 (0.82%) పాయింట్లు లాభపడి 58,723.20 పాయింట్ల వద్ద, నిఫ్టీ 139.45 (0.80%) పాయింట్లు ఎగిసి 17,519.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,500 పాయింట్ల పైన ముగియడం గమనార్హం. ఐటీ, పవర్ స్టాక్స్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ 7.16 శాతం, భారతీ ఎయిర్టెల్ 4.51 శాతం, కోల్ ఇండియా 4.10 శాతం, ఓఎన్జీసీ 3.63 శాతం, టైటాన్ కంపెనీ 3.12 శాతం లాభపడ్డాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.11 శాతం, బీపీసీఎల్ 0.64 శాతం, నెస్ట్లే 0.55 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 0.45 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.38 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్, HDFC బ్యాంకు, రిలయన్స్, ఎస్బీఐ, టీసీఎస్ ఉన్నాయి.