53,000 క్రాస్ చేసిన సెన్సెక్స్, మొదటి రోజే అదరగొట్టిన జొమాటో
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈ వారం మొదటి రెండు రోజుల్లో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన సూచీలు, బుధవారం సెలవు దినం కావడంతో పని చేయలేదు. నిన్న (గురువారం) సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు లాభపడింది. నేడు మరో 139 పాయింట్లు ఎగిసింది. కీలక రంగాల నుండి మద్దతు లభించడంతో ఉదయం కాసేపు నష్టాల్లోకి వెళ్లినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి.
సెన్సెక్స్ ఉదయం 52,967.87 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,114.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,653.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 53100 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 15,856.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,899.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,768.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 32 పాయింట్లు నష్టపోయి 15,856 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదైన జొమాటో షేర్లు దుమ్ము రేపాయి. షేర్ ఐపీఓ ధర రూ.76 కాగా, దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్ట్ అయింది. చివరకు 66 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది. లిస్ట్ అయిన మొదటి రోజు కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.1 లక్ష కోట్లకు చేరింది. మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా బీఎస్ఈ టాప్ 50 జాబితాలోకి చేరుకుంది.