సెన్సెక్స్ @50,000: జోబిడెన్ నుండి బడ్జెట్, కార్పోరేట్ ఎర్నింగ్స్ వరకు...
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 21) సరికొత్త శిఖరాన్ని తాకింది. కరోనా నేపథ్యంలో కొద్ది నెలల పాటు కుప్పకూలిన సెన్సెక్స్, రెండు నెలలుగా 42వేల పాయింట్ల నుండి ఒక్కో మెట్టు పైకి కదులుతోంది. నేడు ఏకంగా 50,000 మార్కును తొలిసారి దాటింది. ఓ సమయంలో 50,100ను దాటింది. నిఫ్టీ14,800 దిశగా దూసుకెళ్తోంది. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 295 పాయింట్లు ఎగిసి 50,0788 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 14,730 పాయింట్ల వద్ద ఉంది. మార్కెట్ జూమ్కు పలు కారణాలు ఉన్నాయి.
తొలిసారి 50,000 మార్కు దాటి.. సెన్సెక్స్ సరికొత్త రికార్డ్
అందుకే మార్కెట్ జోరు
జోబిడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టడంతో అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లు లాభపడ్డాయి. వాల్స్ట్రీట్ అయితే రికార్డ్ లాభాలను నమోదు చేసింది. డౌజోన్స్ 0.83 శాతం, ఎస్ అండ్ పీ 500 1.40 శాతం, నాస్డాక్ 1.97 శాతం మేర లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. ప్రధానంగా జోబిడెన్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్లో జోరును నింపింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు తొలిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే, మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లపై ఉండటంతో, మన మార్కెట్లపై కూడా చూపింది.
బడ్జెట్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో మార్కెట్కు సానుకూల నిర్ణయాలు వెలువడతాయనే అంచనాలు ఉన్నాయి. ఇది కూడా సెన్సెక్స్ జంప్కు కొంత కలిసి వచ్చింది. బడ్జెట్కు ముందు సూచీలు పెరగడం లేదా తగ్గడం జరుగుతూంటుంది. బడ్జెట్ సంబంధిత వార్తలకు అనుగుణంగా సూచీలు కదులుతాయి. అలాగే, రెండు నెలలుగా సెన్సెక్స్ పైపైకి చేరుకుంటోంది. 42వేల నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రెండు నెలల కాలంలో 50వేల మార్కును దాటింది.
కార్పోరేట్ ఎర్నింగ్స్
2020-21 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను పలు కంపెనీలు వెల్లడిస్తున్నాయి. కార్పోరేట్ ఎర్నింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ సహా వివిధ కంపెనీల ఫలితాలు బాగున్నాయి. మార్కెట్ పైన కార్పోరేట్ ఎర్నింగ్స్ ప్రభావం కూడా ఉంది. దేశీయ మార్కెట్లోకి ఫారన్ ఫండ్ ఇన్-ఫ్లో పెరుగుతోంది. ఐపీవోలు కూడా అదరగొడుతున్నాయి. ఇలా వివిధ కారణాలతో మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.