Trading Fact: ఆ ట్రేడింగ్ చేసినోళ్లు నిండా మునిగిపోయారు..! సంచలన రిపోర్ట్.. జాగ్రత్త
Trading Fact: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి ప్రజల్లో చాలా రకాల అభిప్రాయలు ఉంటుంటాయి. కొందరు దీనిని బెట్టింగ్ అంటే మరికొందరు ఇదొక వ్యవసనమని అంటుంటారు. అయితే నేటి యువతరం మాత్రం దీనిని తక్కువ కాలంలో సంపాదనకు రాచమార్గం అని భావిస్తున్నారు. అలా వారికి తోచినట్లు లేదా టిప్స్ ఫాలో అవుతూ మార్కెట్ ప్రపంచంలోకి దూకేస్తున్నారు.
నిండా మునుగుతున్నారు..
స్టాక్ మార్కెట్లో ప్రజలు డబ్బులు కోల్పోవటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. మెుదటిది ట్రేడింగ్ గురించి సరైన అవగాహన అందుకు అవసరమైన స్కిల్స్ లేకపోవటం. ఇక రెండోది రివెంజ్ ట్రేడింగ్ చేయటం. అంటే ఒక ట్రేడ్ మిస్ అయ్యి నష్టం వచ్చినట్లయితే.. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి మరో ట్రేడ్ చేయటం ఇలా నియంత్రణ కోల్పోయి నష్టాల్లోకి జారుకోవటం జరుగుతుంటుంది. అందుకే మార్కెట్లలో నిలకడగా నియంత్రణలో ఉండేవారే ఓర్పుగా లాభాలను సాధించగలరని మార్కెట్ దిగ్గజ ట్రేడర్లు చెబుతుంటారు.
సెబీ రిపోర్ట్..
ఇండియాలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతున్న వేళ సెబీ షాకింగ్ రిపోర్ట్ చాలా కీలకంగా మారింది. తాజా రిపోర్ట్ ప్రకారం ప్రతి 10 మంది ఆప్షన్ ట్రేడర్లలో 9 మంది నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు సెబీ తెలిపింది. ఇలా నష్టపోతున్న వారిలో 84 శాతం మంది మగవారు ఉండటం గమనార్హం. పైగా వీరిలో సింహభాగం అంటే 75 శాతం మంది 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన పురుష ట్రేడర్లు కావటం ఆలోచించాల్సిన విషయమనే చెప్పుకోవాలి.
నష్టాలు ఆ నగరానివే..
ఆప్షన్ ట్రేడింగ్ లో నష్టాలు మూటకట్టుకుంటున్న వారిలో ఎక్కువ మంది కోల్ కతా నుంచే ఉన్నట్లు సెబీ గుర్తించింది. దీంతో ఈ నగరం సిటీ ఆఫ్ లాసెస్ జాబితాలో నిలిచింది. ఆప్షన్ ట్రేడర్లు 2022 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.1.1 లక్షల వరకు నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడైంది.
దూసుకుపోతున్న సీనియర్స్..
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విభాగంలో సీనియర్ సిటిజన్లు విజేతలు ఉన్నారు. అలాగే 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ ఇన్వెస్టర్లు సీనియర్ల కంటే సగటున ఎక్కువ లాభాలను నమోదు చేసినట్లు వెల్లడైంది. అందుకే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత దానిలో పెట్టుబడుల గురించి ఆలోచించటం ఉత్తమమని తెలుస్తోంది.