ఇన్సైడర్ ట్రేడింగ్ వివరాలు ఇస్తే రూ.10 కోట్ల బహుమానం!
ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వ్యక్తులకు ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) పది రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ఈ బహుమతి రూ.1 కోటి కాగా దీనిని రూ.10 కోట్లకు పెంచినట్లు తెలిపింది.
ప్రకటించిన రివార్డ్ రూ.1 కోటి, అంతకంటే తక్కువ ఉంటే తుది ఉత్తర్వులు జారీ అయిన తర్వాత రివార్డ్ మంజూరు ఉంటుంది. రూ.1 కోటి కంటే ఎక్కువ రివార్డ్ అయితే సెబి రూ.1 కోటి వరకు మధ్యంతర రివార్డ్ అందిస్తుంది. ఇది కూడా ఉత్తర్వులు జారీ అయ్యాక వస్తుంది. మిగతా మొత్తం ఆ తర్వాత వస్తుంది.
ఇక, స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనలకు సవరణలతో సహా గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లకు కొత్త నిబంధనావళిని పరిచయం చేసే చర్యలకు ఆమోదం తెలిపింది సెబి. రెసిడెంట్ ఇండియన్ ఫండ్ మేనేజర్స్ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లలో భాగంగా ఉండేందుకు అంగీకరించింది.
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను నిర్వహిస్తోన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు అలాంటి పథకాలతో ఉండే రిస్కుకు అనుగుణంగా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టే విషయంలో నిబంధనలను సవరించింది. కొత్త ఫండ్ ఆఫర్ ద్వారా సమీకరించే మొత్తంలో ఒక శాతం లేదా రూ.50 లక్షలు ఏది తక్కువ అయితే దానిని పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఆర్థిక పారామితుల ఆధారంగా వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, కుటుంబ ట్రస్ట్లు, సింగిల్ ఓనర్ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ట్రస్ట్లు, బాడీ కార్పొరేట్స్ గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లుగా ఉంటారని తెలిపింది.