Sebi New Rules: పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఎప్పటికప్పుడు పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న మోసాలు, వ్యవస్థల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి తాజాగా మరో కొత్త విధానం ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ మేరకు సెబీ ప్రతిపాదించగా.. ఫిబ్రవరి 21 లోపు అభిప్రాయాలు తెలపాలని బ్రోకర్లను కోరింది.

మోసాల కట్టడే లక్ష్యంగా..
బ్రోకర్లకు సహాయంగా ఓ సంస్థాగత వ్యవస్థను ప్రవేశపెట్టాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) మంగళవారం ప్రతిపాదించింది. పలు మోసాలు, దుర్వినియోగాలను నిరోధించేందుకు తనిఖీలు ముమ్మరం చేసి, వాటిని కట్టడి చేసేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే ప్రైస్ మానిప్యులేషన్, ఇన్సైడర్ ట్రేడింగ్, స్పూఫింగ్ మరియు మిస్-సెల్లింగ్ వంటి అనైతిక కార్యకలాపాలను తనిఖీ చేసేందుకు బ్రోకర్లకు తప్పనిసరి నిబంధనలు అంటూ ఏమీ ప్రస్తుతం లేవని గుర్తు చేసింది.

ఉన్నతాధికారులదే బాధ్యత:
MD, CEO, కంప్లయన్స్ అధికారి, డైరెక్టర్లతో సహా టాప్ మేనేజ్మెంట్.. తమ కంపెనీల్లో పటిష్ఠమైన అంతర్గత నియంత్రణ, నిఘా వ్యవస్థల ఏర్పాటుకు బాధ్యత వహించాలని సెబీ తెలిపింది. ఏదైనా పొరపాటు జరిగితే వారే జవాబుదారీగా ఉండాలని సూచించింది. ఈ విధానంలో బలమైన విజిల్ బ్లోయింగ్ వ్యవస్థ ఉంటుందని తన ప్రతిపాదనల్లో సెబీ పేర్కొంది.

లోపాల గుర్తింపుతో పాటే వ్యాపారాభివృద్ధి:
నిఘా, అంతర్గత నియంత్రణ వ్యవస్థలను.. చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తించడంతో పాటు వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా బ్రోకర్స్ సిద్ధం చేసుకోవాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సూచించింది. వివిధ స్థాయిల్లో హెచ్చరికలను గుర్తించేందుకు సహేతుకంగా థ్రెషోల్డ్ సెట్ చేసుకోవాలని కోరింది. స్పష్టంగా, హేతుబద్ధంగా గుర్తించిన విషయాలను డాక్యుమెంట్ చేయాలని పేర్కొంది.

ఆరు నెలలకొకసారి నివేదికలు:
ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లయితే ఆయా కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్ ను బ్రోకర్లు అలర్ట్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీల దృష్టికి తీసుకురావాలి. వీటితో పాటు 6 నెలలకొకసారి గుర్తించిన లోపాల విశ్లేషణ, వాటిని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలపై నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications