Sebi: మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో మార్పుల కోసం సెబీ కొత్త ప్రతిపాదనలు
Sebi: మెరుగవుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలు పెట్టుబడులు, సేవింగ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్టర్ల పెట్టుబడులను సంరక్షించడంలో భాగంగా.. ఎప్పటికప్పుడు సెబీ పలు నియమ, నిబంధనలు ప్రవేశపెడుతోంది. దానితో పాటు గతంలో ఉన్న వాటిని సవరిస్తూ ఉంటుంది.

జవాబుదారీతనం పెంచేందుకు
మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడుతున్న యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందుకు సెబీ నడుం బిగించింది. ఈ విషయంలో ట్రస్టీల, బోర్డ్ ఆఫ్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ జవాబుదారీతనాన్ని పెంచాలని ప్రతిపాదించింది. పబ్లిక్ అనౌన్స్ మెంట్ లను మరింతగా పెట్టుబడిదారుల చెంతకు తీసుకెళ్లేందుకు సైతం ఓ ఉమ్మడి వేదిక ప్రవేశపెట్టాలని పేర్కొంది.

యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ
పెట్టుబడిదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఉత్పత్తులు, సేవల్లో స్వతంత్ర సమీక్ష యంత్రాంగాన్ని AMCలు కలిగి ఉండాలని సెబీ కోరింది. ఈ మేరకు యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ (UHPC) ఏర్పాటు చేయాలని సూచించింది. మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు, దాని ఉద్యోగులు.. మార్కెట్ దుర్వినియోగానికి, అసెట్ బేస్ పెంపుదల కోసం అక్రమ అమ్మకాలకు పాల్పడకుండా దృష్టి పెట్టాలని చెప్పింది. AMC వసూలు చేసే రుసుములు, ఖర్చుల పట్ల బాధ్యత వహించాలని పేర్కొంది. స్పాన్సర్ కు ఎటువంటి అనవసర ప్రయోజనం లభించకుండా చూసుకోవాలని తెలిపింది.

పరిశ్రమ పరిమాణం విస్తరణ
ప్రధాన కార్యకలాపాలతో పాటు పెట్టుబడిదారుల బ్యాంక్ వివరాలు, KYCలపై AMCలు తీసుకున్న చర్యలను కాలానుగుణంగా సమీక్షించడానికి ట్రస్టీలు బాధ్యత వహించాలని సెబీ సూచించింది.
గత దశాబ్ద కాలంలో MF పరిశ్రమ పరిమాణం 5 రెట్లు విస్తరించడంతో.. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడినట్లు పేర్కొంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు(AUM) నవంబర్ 2012లో రూ.7.93 లక్షల కోట్ల నుంచి డిసెంబర్ 2022 నాటికి రూ.39.89 లక్షల కోట్లకు పెరిగినట్లు చెప్పింది.

ప్రజాభిప్రాయ సేకరణ
అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ అన్ని కార్యకలాపాలు ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి AMC బోర్డు బాధ్యత తీసుకోవాలని తాజా సవరణలో సెబీ పేర్కొంది. ప్రజల అభిప్రాయాలు స్వీకరించేందుకు ఫిబ్రవరి 24 వరకు సమయం ఇచ్చింది.


Click it and Unblock the Notifications