నేడు తెలంగాణవ్యాప్తంగా స్కూళ్లు బంద్.. పాఠశాలల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్..
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా సహకరించాలని ఆ సంఘం కోరింది.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, కనీస మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లుతుంటే, పరోక్షంగా ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వమే బ్రాండ్ అంబాసిడర్గా మారుతోందని ఏబీవీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసే విధంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేయడానికి ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ రాష్ట్రవ్యాప్త బంద్ ద్వారా ఏబీవీపీ కొన్ని కీలకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి కనీస మౌలిక వసతులను వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు, సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి వాటిని తక్షణమే భర్తీ చేయాలని ఒత్తిడి తెస్తోంది. మరోవైపు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు, ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా నియంత్రించేందుకు ఒక కఠినమైన 'ఫీజుల నియంత్రణ చట్టాన్ని' తేవాలని కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.
బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు అన్ని ప్రధాన పాఠశాలల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తగా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, ఈ బంద్ ప్రభావం , విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తమ విద్యాసంస్థలకు ముందస్తుగానే సెలవులను ప్రకటిస్తున్నాయి.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు సొంత పక్కా భవనాలను నిర్మించాలని, విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, అన్ని పాఠశాలల్లో "బ్రేక్ ఫాస్ట్ స్కీమ్" (ఉదయపు అల్పాహార పథకం) ను వెంటనే పునరుద్ధరించి అమలు చేయాలని ఏబీవీపీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే స్పందించి రాష్ట్ర విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని, లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రజాపోరాటాలు చేపడతామని మాచెర్ల రాంబాబు హెచ్చరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
