ఏం టైంకు తెరుచుకుంటాయ్: బ్యాంకు పనివేళల్లో మార్పులు, SBI ఏం చెప్పిందంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖల పనివేళల్లో ఎలాంటి మార్పులు లేవని ఈ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు తెలిపింది. బ్యాంకుల పనివేళలు మార్చినట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ జోన్ ఎస్బీఐ అధికారులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసారు. బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తాయని వెల్లడించింది.
హెచ్చరిక: ప్రజల చేతుల్లో డబ్బులేవి, తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి భారత్
పని వేళల్లో మార్పులంటూ..
కరోనా మహమ్మారి-లాక్డౌన్ నేపథ్యంలో బ్యంకుల పనివేళలు మారాయని, అలాగే ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ బ్యాంకు వేళలు కూడా మారినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక నుండి దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచులు ఉదయం గం.11.30కు తెరుచుకుంటాయని చెప్పినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే రాష్ట్రం ప్రాతిపదికన బ్యాంకు పనివేళల్లో మార్పులు ఉంటాయని కూడా చెప్పారు. అయితే బ్రాంచీలు ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు వరకు తెచురుకుంటాయని హైదరాబాద్ జోన్ ఎస్బీఐ స్పష్టం చేసింది.
ఎస్పీఐ హెచ్చరిక
ఫ్రాడ్ చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా ఎస్బీఐ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, గోప్యంగా ఉంచాలని తమ కస్టమర్లను కోరుతున్నామని ఎస్బీఐ ట్వీట్ చేసింది. మీ ఓటీపీ, సీవీవీ, బ్యాంకు అకౌంట్ వివరాలు కావాలని ఫోన్ కాల్ ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా ఎస్బీఐ ఎప్పుడూ కోరదని తెలిపింది.
బ్యాంకు అధికారులుగా చెబుతూ..
బ్యాంకు అధికారుల వలె వచ్చి ఫ్రాడ్ చేసే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ హెచ్చరిస్తోంది. బ్యాంకు అధికారులుగా చెప్పి మొబైల్ ఫోన్ యాక్సెస్ పొంది ఫ్రాడ్ చేసేవారు ఉంటారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని గుర్తిస్తే మీరు వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలని కూడా ఇదివరకు ట్వీట్ చేసింది.