ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 డిమాండ్లతో.. SBI ఉద్యోగుల సంచలన స్ట్రైక్! ఎప్పుడంటే..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ హక్కుల సాధన కోసం, పని పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ మే 25 , 26 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 'ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్' (AISBISF) ఈ మేరకు మే 2వ తేదీనే బ్యాంకు ఛైర్మన్కు నోటీసు ఇచ్చింది. ఒకవేళ ఆ తేదీల్లో సెలవు వస్తే, మే 27న కూడా సమ్మె కొనసాగే అవకాశం ఉంది.

అసలు ఈ సమ్మె (SBI Strike) ఎందుకు?
బ్యాంకు యాజమాన్యం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదని ఫెడరేషన్ ఆరోపిస్తోంది. దాదాపు 16 ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మె చేపడుతున్నారు. ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది (Workmen) హక్కులను కాలరాస్తున్నారని, శాశ్వత ఉద్యోగాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వడం వల్ల భద్రత కరువవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఏమిటంటే..
- మెసెంజర్లు , ఆర్మ్డ్ గార్డ్ ల నియామకం: గత మూడు దశాబ్దాలుగా మెసెంజర్ పోస్టులను భర్తీ చేయడం లేదని, దీనివల్ల పేద వర్గాలకు ఉపాధి దక్కడం లేదని యూనియన్ అంటోంది. అలాగే ఇటీవల సూరత్ బ్రాంచ్లో జరిగిన దోపిడీని గుర్తు చేస్తూ, ఆర్మ్డ్ గార్డ్ల రిక్రూట్మెంట్లో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించింది.
- NPS పెన్షన్ సమస్యలు: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉన్న ఉద్యోగులకు తమ పెన్షన్ ఫండ్ మేనేజర్ను మార్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ వెసులుబాటు ఉన్నా, SBIలో లేకపోవడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని వారు వాదిస్తున్నారు.
- జీతాల వ్యత్యాసం (Parity Issue): అధికారులకు ఒకలా, కింది స్థాయి సిబ్బందికి మరోలా జీతాలు పెంచడంపై వారు మండిపడుతున్నారు. 12వ బైపార్టైట్ సెటిల్మెంట్ ప్రకారం అందరికీ సమానంగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
- బదిలీలు , ప్రమోషన్లు: 2019 తర్వాత చేరిన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ బదిలీలు కల్పించాలని, కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ను సమీక్షించాలని కోరుతున్నారు.
- ఇక వీటితో పాటు అధికారులతో సమానంగా వేతన పెంపు (Parity), కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ సమీక్ష, 10వ బైపార్టైట్ రిటైరీలకు 8వ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ వర్తింపజేయడం, 7వ BPS రిటైరీల పెన్షన్ సమస్యలు పరిష్కరించడం, ఫిజీషియన్ కన్సల్టేషన్ ఛార్జీల పెంపు, మెడికల్ రీయింబర్స్మెంట్ మెరుగుదల, HRMS లోపాలను సరిదిద్దడం, వర్క్మెన్ ఎంప్లాయీ డైరెక్టర్ , PF ట్రస్టీ నామినీ నియామకం చేపట్టడం , క్రాస్ సెల్లింగ్ పేరుతో సాగిస్తున్న మిస్-సెల్లింగ్ను ఆపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ముందస్తు నిరసన కార్యక్రమాలు
సమ్మెకు ముందే మే నెల అంతా వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. మే 5న లంచ్ టైమ్ ప్రదర్శనలు, మే 6న సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అలాగే మే 19న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, మే 21న ప్రధాని నరేంద్ర మోదీకి తమ సమస్యలపై మెమోరాండం సమర్పించనున్నారు.
కస్టమర్లపై ప్రభావం ఎంత?
ఈ రెండు రోజుల సమ్మె (SBI Strike) వల్ల బ్యాంకు లావాదేవీలు, నగదు డిపాజిట్లు , చెక్కుల క్లియరెన్స్పై ప్రభావం పడే అవకాశం ఉంది. కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే తమ ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను సమ్మె తేదీలకు ముందే పూర్తి చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications