SBI special offers: కారు, గోల్డ్ లోన్ పైన ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్
భారత్ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వివిధ రిటైల్ రుణాల పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. దీంతో పాటు వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. ఇటీవల హోమ్ లోన్స్ పైన పరిమిత కాలపు ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు గతంలో ప్రకటించింది. తాజాగా వాహనాలు, బంగారం రుణాలపై రిటైల్ కస్టమర్లకు ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది.
కారు రుణాలపై వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. అలాగే బంగారం రుణాలపై కూడా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ 2022 జనవరి 1వ తేదీ వరకు వర్తిస్తుంది. కస్టమర్లు కార్-ఆన్-రోడ్ ధర పైన 90 శాతం వరకు రుణాలు పొందవచ్చు.
అలా చేస్తే ఆఫర్లే ఆఫర్లు
యోనో యాప్ ద్వారా కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీని అందిస్తోంది. యోనో యాప్ కస్టమర్లు కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే 7.5 శాతం అతి తక్కువ వార్షిక వడ్డీ రేటుతో రుణం పొందవచ్చు. ఇక, బంగారంపై రుణాలను తీసుకునే వారికి కూడా 75 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేటు తగ్గించింది ఈ ప్రభుత్వరంగ దిగ్గజం. కస్టమర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లేదా యోనో యాప్ ద్వారా.. ఎలా దరఖాస్తు చేసుకున్నా 7.5 శాతం వార్షిక వడ్డీతో గోల్డ్ లోన్ పొందవచ్చు. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదని తెలిపింది.
వారికి 50 బేసిస్ పాయింట్ల రాయితీ
ఎస్బీఐ పర్సనల్, పెన్షన్ లోన్ కస్టమర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లేదా యోనో యాప్ ద్వారా రుణం తీసుకున్నా వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ శుభవార్త తెలిపింది. ఎవరైనా కోవిడ్ వారియర్స్ అంటే హెల్త్ కేర్ వర్కర్స్ వంటి ఫ్రంట్లైన్లో ఉన్నవారు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తోంది.
దీనిని త్వరలోనే కారు, గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ప్లాటినం టర్మ్ డిపాజిట్స్ను ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్స్ పైన 15 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని అందించనుంది. ఇది ఆగస్ట్ 2021 నుండి 14 సెప్టెంబర్ 2021 వరకు అమల్లో ఉంటుంది.
ఇటీవలే రక్షాబంధన్ ఆఫర్
ఎస్బీఐ రక్షా బంధన్ సందర్భంగా కూడా మంచి ఆఫర్ ప్రకటించిన విషయంతెలిసిందే. SBI కస్టమర్లు ఫెర్న్స్ అండ్ పెటల్స్లో చేసే కొనుగోళ్లపై రూ .999 వరకు లేదా ఫ్లాట్ 20% వరకు డిస్కౌంట్ అందించింది. అయితే ఇందుకు యోనోను ఉపయోగించాలి. ఆఫర్ పొందడానికి SBI యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి.
ఎస్బీఐ ప్రకటించిన ఆఫర్పై ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అధికారిక SBI YONO వెబ్సైట్ sbiyono.sbi కి లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రక్షాబంధన్ సందర్భంగా మీ ప్రియమైనవారికి బహుమతులు కొనుగోలు చేసేందుకు మరింత సులభతరం చేయడానికి ఎస్బీఐ నుండి వచ్చిన ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది.
ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఇతర ప్రజలు రక్షా బంధన్ను జరుపుకోవాలని ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. ఫెర్న్ ఎన్ పెటల్స్ వద్ద షాపింగ్ చేయండి, YONO SBI ద్వారా రూ .999 వరకు లేదా 20% తగ్గింపు పొందండి అని పేర్కొంది.