SBI report: కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై SBI షాకింగ్ రిపోర్ట్.. అవన్నీ తప్పుడు నివేదికలే..
SBI report: దేశంలోని కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పరిశోధన జరిపింది. రిటైల్ లోన్లు, ఫైనాన్షియల్ సేవింగ్స్ సహా భౌతికంగా కూడబెట్టిన ఆస్తులపైనా రీసెర్చ్ చేసి నివేదిక విడుదల చేసింది. ఇందులో పలు షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.
SBI రీసెర్చ్ నివేదిక ప్రకారం.. కరోనా వ్యాప్తి వేళ ఆర్థిక సంస్థలు వడ్డీరేట్లు తగ్గించడంతో ప్రజలు మరోపవైపు మళ్లారు. బ్యాంకులు వంటి ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్లో సేవింగ్స్కు బదులు భౌతికంగా ఆస్తులు కూడబెట్టుకునేందుకు ఆసక్తి చూపించారు. గత రెండేళ్లలో ఆయా కుటుంబాల రిటైల్ క్రెడిట్లో 55 శాతం గృహ, వాహనాల కొనుగోళ్లతో పాటు విద్య కోసం వెచ్చించారు.

ఫ్యామిలీ సేవింగ్స్ 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయనే వాదనలను SBI అధ్యయనం తప్పుపట్టింది. ఆ నివేదికలు పూర్తిగా తప్పుదారి పట్టించేవని తేల్చిచెప్పింది. పొదుపును లెక్కించే సమయంలో కేవలం ఆర్థిక వనరులను మాత్రమే కాక భౌతిక ఆస్తులనూ పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
'కరోనా అనంతరం కుటుంబాల ఆర్థిక ఖర్చులు 8.2 ట్రిలియన్ రూపాయల మేర పెరిగాయి. అదే సమయంలో పొదుపు కూడా 6.7 ట్రిలియన్లకు చేరింది. అంటే నికర మానిటరీ సేవింగ్స్ 1.5 ట్రిలియన్ల మేర తగ్గాయి. కానీ గృహాల కొనుగోళ్లు, ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ల రూపేణా పొదుపులో 4.1 ట్రిలియన్ల పెరుగుదల నమోదైంది' అని SBI నివేదిక వెల్లడించింది.


Click it and Unblock the Notifications