SBI Q3 results: రికార్డ్ లాభం, 41 శాతం పెరిగిన వృద్ధి
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్కు గాను భారీ లాభాలు గడించింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఏకంగా 41.17 శాతం స్టాండలోన్ ప్రాఫిట్తో రూ.5,583.36 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈ బ్యాంకుకు ఈ ప్రాఫిట్ రికార్డ్. ఓ క్వార్టర్లో నికర లాభంలో ఇంత ఎక్కువ వృద్ధి కావడం ఎస్బీఐ చరిత్రలో తొలిసారి.
ఎస్బీఐ స్థూల ఎన్పీఏలు 2018 డిసెంబర్ క్వార్టర్ నాటికి 8.71 శాతంగా ఉండగా, 2019 డిసెంబర్ నాటికి 6.94 శాతానికి తగ్గిపోయాయి. నికర నిరర్థక ఆస్తులు 3.95 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి. మొండి బకాయిల ప్రొవిజన్లు రూ.13,970 నుంచి రూ.8,193కు తగ్గాయి. 201 9-20 ఆర్థిక సంవత్సరంలోనే అంతకుముందు క్వార్టర్లో 7.19 శాతంగా నమోదయింది. నెట్ ఇంటరెస్ట్ ఇన్కం (NII) 22.42 శాతం పెరిగి రూ.27,778.79 కోట్లుగా నమోదయింది.
సమీక్ష త్రైమాసికానికి బ్యాంకు ఏకీకృత ఆదాయం రూ.95,384.28 కోట్లకు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్లో ఈ ఆదాయం రూ.84,390.14 కోట్లుగా నమోదయింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు ఆదాయం రూ.76,797.91 కోట్లుగా ఉంది.
ఎస్బీఐ క్వార్టర్ 3 ఫలితాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్లలో బ్యాంకు షేర్లు జోరు కొనసాగించాయి. మధ్యాహ్నం సమయానికి ఏకంగా రూ.9.75 లేదా 3.14 శాతం పెరిగి షేర్ రూ.320.45 వద్ద కొనసాగింది. మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి ఈ షేర్ ధర రూ.7.40 (2.38%) లాభంతో 318.10 ముగిసింది.