కస్టమర్లకు ఎస్బీఐ శుభవార్త, వడ్డీ రేట్లు తగ్గింపు: మీ హోమ్లోన్ EMI తగ్గొచ్చు
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MLCR)ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అన్ని కాలపరిమితులపై ఇది వర్తిస్తుంది. ఈ వడ్డీ రేటు కోతతో ఏడాది MLCR 7.40 శాతం నుండి 7.25 శాతానికి తగ్గుతుంది. కొత్త వడ్డీ రేట్లు మే 10వ తేదీ నుండి అమలులోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. MLCRలో ఇది వరుసగా 12వ తగ్గింపు అని బ్యాంకు తెలిపింది.
తాజా తగ్గింపు తర్వాత MCLR లింక్డ్ హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయి. ఉదాహరణకు రూ.25 లక్షల లోన్ పైన 30 ఏళ్ల కాలపరిమితి ఉంటే రూ.255 తగ్గుతుందని ఎస్బీఐ తెలిపింది. MCLR వడ్డీ రేటు అంటే బ్యాంకు సొంత నిధుల ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. మీ హోమ్ లోన్ కనుక ఎస్బీఐ MCLRతో లింక్ అయి ఉన్నంత మాత్రాన మీ ఈఎంఐ తగ్గింపు అప్పుడే ఉండదు. ఎందుకంటే ఏడాదికోసారి రీసెట్ ఉంటుంది.
మూడేళ్ల కాలపరిమితి గల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లు మార్చి 12వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. సీనియర్ సిటిజన్ల ప్రయోజనం కాపాడటం కోసం రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో ఎస్బీఐ వీ-కేర్ డిపాజిట్ స్కీంను ప్రారంభించింది. ఈ పథకం సెప్టెంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఐదేళ్లు అంతకంటే వ్యవధిలో ఈ డిపాజిట్లను అదనంగా 30 బేసిస్ పాయింట్స్ ప్రీమియం వడ్డీని అందిస్తుంది.