SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాలో మరో మైలురాయిని వేసుకుంది. కంపెనీ క్యాపిటలైజేషన్ భారీగా పెగటంతో దేశంలోని మూడవ అతిపెద్ద బ్యాంక్ గా అవతరించింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.5 లక్షల కోట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 22 శాతం పెరిగింది. వరుసగా ఐదు ట్రేడింగ్ దినాల్లో స్టాక్ బుల్లిష్గా ఉంది. ఈ కాలంలో షేర్ విలువ 6% పెరిగింది.

HDFC బ్యాంక్ & ICICI బ్యాంక్..
ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్తో సహా బ్యాంకులు గతంలో ఈ మైలురాయిని చేరుకున్నాయి. భారతీయ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఈ మైలురాయిని అందుకున్నాయి.

7వ స్థానంలో ఎస్బీఐ..
భారతదేశపు అత్యంత విలువైన కంపెనీల జాబితాలో SBI ఇప్పుడు ఏడవ స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మెుదటి స్థానంలో ఉండగా.. తరువాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉన్నాయి.

బ్యాంక్ షేర్లలో భారీ ర్యాలీ..
ద్రవ్యోల్బణంతో పాటు దేశంలో క్రెడిట్ కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. గత కొన్ని సెషన్లలో బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ క్రెడిట్ కోసం డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ఎస్బీఐ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 2 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 5%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3%, యాక్సిస్ బ్యాంక్ 7.5% మేర లాభపడ్డాయి.

SBI కీలక పాత్ర..
రుణాల విషయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఈ దూకుడు కొనసాగుతుందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. రిటైల్ క్రెడిట్ వృద్ధి కూడా గత కొన్ని సంవత్సరాలుగా మంచి వృద్ధిని సాధించింది. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం దీనిని అందిపుచ్చుకోవటంలో ముందు వరుసలో ఉంది.


Click it and Unblock the Notifications