బేసిక్ సేవింగ్స్, జన్ ధన్ అకౌంట్ అదనపు ఛార్జీల ద్వారా రూ.346 కోట్లు
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి అక్టోబర్ 2021 వరకు బేసిక్ సేవింగ్స్, జన్ ధన్ అకౌంట్స్ వంటి వాటి పైన అదనపు ఛార్జీల ద్వారా రూ.346 కోట్లను కలెక్ట్ చేసింది. కస్టమర్లకు ఉచిత సేవలను అందించడంతో పాటు పై సేవలకు గాను ఈ మొత్తం వచ్చినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ మంగళవారం పార్లమెంటుకు తెలిపింది.
ఎస్బీఐ సమాచారం మేరకు 2017-18 నుండి అక్టోబర్ 2021 వరకు కస్టమర్లు కోరిన కనీస ఉచిత సేవలకు మించి అదనపు సేవలను అందించినందుకు గాను రూ.345.84 కోట్లు కలెక్ట్ అయినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఆగస్ట్ 30, 2020 నాటి సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం రూపే డెబిట్ కార్డు, యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్స్ను ఉపయోగించి నిర్వహించిన ట్రాన్సాక్షన్స్పై జనవరి 1, 2020న లేదా ఆ తర్వాత ఏవైనా వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంకులకు సూచించినట్లు తెలిపారు.
ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(PMJDY) కింద ఓపెన్ చేసిన ఖాతాలతో సహా వివిధ బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ (BSBDA)లో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు.