SBI ATM rules: మారిన SBI ఏటీఎం విత్డ్రా రూల్స్.. ఆ మోసాలను తగ్గించేందుకే.. తప్పక తెలుసుకోండి..
SBI ATM Cash Withdrawal Rules: దేశంలో అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM మోసాలను నిరోధించడంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంది. ATMలలో పెరుగుతున్న బ్యాంక్ స్కామ్లను పరిష్కరించేందుకు ఖాతాదారులను హెచ్చరిస్తూనే ఉంది.
|
కొత్త రక్షణ వ్యవస్థ..
మోసాల నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లను రక్షించడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం రెండు-దశల ధృవీకరణ(Two step verification) వ్యవస్థను అమలు చేస్తోంది. దీని ప్రకారం SBI ATM నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే సమయంలో కస్టమర్లు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) నమోదు చేయవలసి ఉంటుంది.
రూ.10 వేలు దాటితే..
ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా సమయంలో వినియోగదారుడు రూ.10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే కొత్త విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ATM మోసాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నందున.. జనవరి 2020లో SBI ఈ సేవను ప్రారంభించింది. దీని ప్రకారం వినియోగదారుని రిజిస్టర్డ్ మెుబైల్ నంబర్ కు ట్రాన్సాక్షన్ సమయంలో నాలుగు అంకెల OTP వస్తుంది. దానిని ధృవీకరిస్తేనే లావాదేవీ పూర్తవుతుంది.
OTPని ఉపయోగించి నగదు ఎలా విత్డ్రా చేయాలి..
Step-1: మీరు రిజిస్టర్డ్ నంబర్తో లింక్ అయిన మీ మొబైల్ ఫోన్తో పాటు మీ డెబిట్ కార్డ్ను ATMకి తీసుకెళ్లాలి.
Step-2: ATM మెషిన్ స్లాట్లో డెబిట్ కార్డ్ ఉంచి.. PIN నంబర్ నమోదు చేయాలి. రూ.10,000 కంటే ఎక్కువ డ్రా చేయాలనుకున్నట్లయితే.. అమౌంట్ ఎంటర్ చేయాలి.
Step-3: అమౌంట్ ఎంటర్ చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో SMS ద్వారా అందుకున్న OTPని నమోదు చేయాలి
Step-4: ఓటీపీ ఎంటర్ చేయటంతోనే నగదు ఉపసంహరణ పూర్తవుతుంది.
ప్రస్తుతం 24 గంటలూ అందుబాటులో..
ఓటీపీ ఆధారిత విధానాన్ని ప్రారంభంలో SBI ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య జరిగే లావాదేవీల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే.. సెప్టెంబర్ 18, 2020 నుంచి ఈ సౌకర్యాన్ని 24×7 అందుబాటులో ఉంది. "SBI ATMలలో మీ లావాదేవీలు గతంలో కంటే ఇప్పుడు మరింత సురక్షితంగా ఉన్నాయి. ATMలలో లావాదేవీల కోసం OTP ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ మోసగాళ్లకు అడ్డుకట్టవేసే టీకా లాంటిదని బ్యాంక్ చెబుతోంది.