Samvat 2078: పాజిటివ్గా ప్రారంభమైన మార్కెట్లు, సెన్సెక్స్ 295 పాయింట్లు జంప్
దీపావళి రోజున సంవత్ 2078లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన మూరత్ ప్రత్యేక ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అదరగొట్టాయి. గంటసేపు జరిగిన ఈ ట్రేడింగ్ను బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురువారం సాయంత్రం 6.15 గంటలకు గంటకొట్టి ప్రారంభించారు. ట్రేడింగ్ ప్రారంభం నుండి సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఓదశలో దాదాపు 400 పాయింట్ల లాభంలోకి దూసుకెళ్లిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరికి 295.70 పాయింట్లు లాభపడి 60,067 వద్ద ముగిసింది. నిఫ్టీ 87.60 పాయింట్లు లాభంతో 17,916 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 60,207.97 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,207.97 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,011.46 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 295.70 (0.49%) పాయింట్లు లాభపడి 60,067.62 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.49 పాయింట్లు లాభపడి 17,916.80 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 62,245.43, అలాగే 52 వారాల కనిష్టం 40,076.47. నిఫ్టీ 52 వారాల గరిష్టం 18,604.45 పాయింట్లు, 52 వారాల కనిష్టం 12,131.85.
నిఫ్టీలో ఐచర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ముగియగా, హిండాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఆటో, PSU బ్యాంక్ షేర్లు 1 శాతం పైన లాభపడగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి.