అసెంబ్లీ ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్ ధరల వాత: తప్పకపోవచ్చా?
ముంబై: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్లో రెండుదశల్లో పోలింగ్ ముగిసింది. ఇంకో అయిదు విడతలు మిగిలి ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్లో రెండో విడతతో పాటు గోవా, ఉత్తరాఖండ్లల్లో ఈ నెల 14వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఉత్తర ప్రదేశ్లో మూడో దశలో 59 స్థానాలతో పాటు పంజాబ్లో 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మార్చి 10న ఫలితాలు..
పంజాబ్లో 2,13,88,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం 24,689 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మణిపూర్లో రెండు విడతలు, ఉత్తర ప్రదేశ్లో నాలుగు దశల్లో మార్చి 7వ తేదీ నాటికి పోలింగ్ పూర్తవుతుంది. అదే నెల 10వ తేదీన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అధికారాన్ని ఏర్పాటు చేసేదెవరో..ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యేదెవరో ఆ రోజే తేలిపోతుంది.
సరఫరాపై ఎఫెక్ట్..
ఫలితాలు వెల్లడయ్యే మార్చి 10వ తేదీ తరువాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తాయనే అంచనాలు మార్కెట్లో వ్యక్తమౌతోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం దీనికి కారణం కావచ్చని అంటున్నారు. ఈ పరిస్థితులు చమురు సరఫరాను దెబ్బతీయగలవని చెబుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చని, ఈ పరిణామాలు వాటి రేట్లు పెరగడానికి దారి తీయగలవనే అభిప్రాయాలు ఉన్నాయి.
గరిష్ఠానికి
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 57 శాతానికి ట్రేడ్ అయింది. బ్యారెల్ ధర 93.54 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో క్రూడ్ ప్రైస్ 69 శాతానికి ట్రేడ్ అయింది. డాలర్తో పోల్చుకుంటే 0.5 శాతం తగ్గింది. 91.07 డాలర్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఈ వారం ఆరంభంలో అటు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్, ఇటు యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బ్యారెల్ ధర గరిష్ఠస్థాయికి చేరింది. శుక్రవారం నాటికి స్వల్పంగా క్షీణత కనిపించింది వాటి ధరల్లో.
రష్యా దాడికి సిద్ధమా..?
రష్యా సైనికులు ఏ క్షణమైన ఉక్రెయిన్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- వచ్చేవారం ఆయిల్ ట్రేడింగ్లో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నాయి మార్కెట్ వర్గాలు. 50 శాతం మంది రష్యన్ సైనికులు- ఉక్రెయిన్పై యుద్ధానికి దిగడానికి సన్నద్ధంగా ఉన్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. రష్యా దీన్ని తోసిపుచ్చింది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఇదే రకమైన ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది.
సరఫరాపై ప్రభావం..
యుద్ధం జరిగితే ఇరాన్- తన చమురు సరఫరాను కట్టుదిట్టం చేయొచ్చని, ఫలితంగా- డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండకపోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే - రేట్లు పెరగడం ఖాయమని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ- ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచకపోవడానికి ఎన్నికలే కారణం అనే వాదనలు వినిపిస్తోన్నాయి. మార్చి 10వ తేదీ తరువాత అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా వాటి రేట్లను సవరిస్తాయని చెబుతున్నారు.
దీపావళి తరువాత..
గత సంవత్సరం కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4వ తేదీ తరువాతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు పెట్రో ఉత్పత్తులు కూడా వంద రూపాయల మార్క్ను దాటేశాయి. పెట్రోల్ ధర ఒక దశలో లీటర్ ఒక్కింటికి 120 రూపాయల వరకు వెళ్లింది. ఆ తరువాత- దీపావళి పండగ కానుకగా కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేయడంతో కాస్త అదుపులోకి వచ్చింది.