PM Modi: నరేంద్ర మోదీ హయాంలో భారీగా క్షీణించిన రూపాయి.. కారణమేంటంటే..?!
Rupee Fall: అమెరికన్ డాలర్ అంతర్జాతీయ మార్కెట్లలో తన ఆధిపత్యం చెలాయిస్తోంది. అధిక సడలింపుతో సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధిని పెంచుకున్న యూఎస్, ద్రవ్యోల్బణం పెరగడంతో దాని ద్రవ్య విధానాన్ని సడలించాన్ని తగ్గించింది. ఫలితంగా.. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు US డెట్, బాండ్ మార్కెట్లకు తరలిపోతున్నాయి. ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ కాగుతూ చారిత్రాత్మక గరిష్ఠాలను తాకటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా గొలుసు అంతరాయాలు డాలర్ ఆధిపత్యాన్ని పెంచాయి.
పాతాళానికి రూపాయి..
ఫలితంగా అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారిగా 80ని తాకింది. మార్కెట్ నిపుణులు అంచనా ప్రకారం మరో మూడు నెలల్లో రూపాయి 83 స్థాయిలకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ హయాంలోనే రూపాయి విలువ దాదాపు 25 శాతం పడిపోయిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
డిసెంబరు 2014తో పోలిస్తే అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ దాదాపు 25 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు.
లోక్సభలో ప్రశ్న..
డిసెంబర్ 31, 2014న US డాలర్తో రూపాయి మారకం విలువ 63.33గా ఉంది. జూలై 11, 2022న అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 79.41కి పడిపోయిందని లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వారం తరువాత జూలై 18న రూపాయి మారక విలువ 80.064కి క్షీణించింది.
పతనానికి కొన్ని కారణాలు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచం వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, పెరుగుతున్న దిగుమతి చెల్లింపులు.., ఇలా మరిన్ని కారణాల వల్ల రూపాయి పతనానికి దారితీస్తోంది.
ఇతర కరెన్సీలు..
బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్, యూరో వంటి కరెన్సీలు కూడా స్వల్పంగా క్షీణించాయి. అయితే.. 2022లో ఈ కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి బలపడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.