భారీ నష్టాల్లో మార్కెట్లు, కారణాలివే: రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్లు గురువారం (మే 12) కుప్పకూలాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ 54,088 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 53,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ప్రారంభంలోనే సూచీలు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం సెన్సెక్స్ 53,608 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,632 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,702 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,021 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,041 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,735 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.3.20 సమయానికి 1112 పాయింట్లు క్షీణించి 52,976 పాయింట్ల వద్ద, నిఫ్టీ 345 పాయింట్లు తగ్గి 15,822 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ చాన్నాళ్లకు 53,000 పాయింట్ల దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు దాదాపు 9500 పాయింట్ల తక్కువకు కూడా పడిపోయింది.
నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు రెండు శాతానికి పైగా పడిపోయాయి. మెటల్, విద్యుత్, ఆటో మొబైల్, బ్యాంకింగ్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ సూచీలు రెండు శాతం నుండి మూడు శాతం మేర పడిపోయాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలను చవిచూశాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పైన ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి.
మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లు పతనమైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.246.31 లక్షల కోట్ల నుండి రూ.241.15 కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఏప్రిల్ 11న రూ.275 కోట్లకు పైన ఉంది. ద్రవ్యోల్భణ ఆందోళనలు, డాలర్ జంప్, ఆసియా మార్కెట్ నష్టాలు, ఎఫ్పీఐ ఔట్ ఫ్లో వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపాయి.