రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరి: 2011 తర్వాత మొదటిసారి.. అమెరికా మార్కెట్ ఇలా..
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి కూడా పతనమైంది. వివిధ కారణాలతో సెన్సెక్స్ 866 పాయింట్లు నష్టపోయి 54,835 పాయింట్లు, నిఫ్టీ 271 పాయింట్లు క్షీణించి 16,411 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు సూచీలు కూడా దాదాపు ఒకటిన్నర శాతం క్షీణించింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువన ముగిసింది.
రూ.4.5 లక్షల కోట్లు ఆవిరి
నిన్న సూచీలు భారీగా పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.47 లక్షల కోట్లు తగ్గింది. దీంతో ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.255.17 లక్షల కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్ ఉదయం 54,928 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఏ దశలోను కోలుకోలేదు. రోజంతా 55,000 పాయింట్లకు దిగువనే ట్రేడ్ అయింది. ఓ సమయంలో 54,600 పాయింట్ల దిగువకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో లాభాలు తగ్గడంతో వోల్టాస్ షేర్ ధర ఏకంగా 7.71 శాతం పడిపోయింది. సెన్సెక్స్ 30లో 24 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకులు 4 శాతం నుండి 5 శాతం మధ్య నష్టపోయాయి.
అందుకే నష్టాలు
మార్కెట్ నష్టాలకు వివిధ కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ సెంటిమెంట్ బలహీనంగా మారింది. అలాగే, ముడి చమురు ధరలు భారీగా పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల నుండి అమ్మకాలు వెల్లువెత్తడం నష్టాలకు తోడయ్యాయి. బ్యారెల్ చమురు 113 డాలర్లు దాటింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 55 పైసలు తగ్గి 76.90 వద్ద ముగిసింది.
2011 తర్వాత మొదటిసారి
ఆసియా మార్కెట్లు కూడా నిన్న నష్టాల్లో ముగిశాయి. హాంగ్ కాంగ్, షాంఘై, కొరియా మార్కెట్లు నష్టపోయాయి. టోక్యో మార్కెట్ మాత్రమే లాభాల్లో ముగిసింది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో 2011 తర్వాత ఎస్ అండ్ పీ మొదటిసారి వారమంతా నష్టాల్లోనే కొనసాగింది. అలాగే, 2020 తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయింది మళ్లీ ఇప్పుడే. డౌ జోన్స్ 1000 పాయింట్లు, నాస్డాక్ 5 శాతం క్షీణించాయి.