వెండి ధరల పెరుగుదలపై బయటపడిన చైనా కుట్ర.. కీలక సమాచారం అందించిన రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి కాగితపు ఆస్తులపై తనకున్న అపనమ్మకాన్ని ఎప్పుడూ బయటపెడుతూనే ఉంటాడు. స్టాక్స్, బాండ్లు, ఫ్యూచర్స్ వంటి కాగితపు పెట్టుబడులకంటే బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులే నిజమైన భద్రతనిస్తాయని ఆయన చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ వెండి మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తన హెచ్చరికలకు ప్రత్యక్ష ఉదాహరణగా మారుతున్నాయని ఆయన చెబుతున్నారు.
ఇటీవల వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. భారతీయ మార్కెట్లో MCXలో వెండి ధరలు కిలోగ్రాముకు సుమారు రూ.3.2 లక్షలకు చేరాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మార్చి డెలివరీకి ట్రేడయ్యే కామెక్స్ వెండి ఫ్యూచర్స్ ఔన్సుకు 94.74 డాలర్ల స్థాయిని తాకాయి. ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో కియోసాకి తన విశ్లేషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Robert Kiyosaki ప్రకారం.. పాశ్చాత్య దేశాల్లో వెండి మార్కెట్లో జరిగే లావాదేవీల్లో ఎక్కువ భాగం భౌతిక లోహంతో సంబంధం లేకుండా కాగితంపై మాత్రమే జరుగుతోంది. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు, డెరివేటివ్స్, ఇతర ఆర్థిక సాధనాల ద్వారానే ధరలు నిర్ణయించబడుతున్నాయని ఆయన చెబుతున్నారు. ఈ లావాదేవీల్లో చాలా వరకు నగదు రూపంలోనే సెటిల్ అవుతాయి. వాస్తవంగా చెప్పాలంటే.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే నిజమైన వెండి డెలివరీ జరుగుతుంది.
ఈ వ్యవస్థ బ్యాంకులు, పెద్ద ఆర్థిక సంస్థలు భారీగా వెండి ఎక్స్పోజర్ను అమ్మడం వల్ల కొనసాగుతోందని కియోసాకి అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పెట్టుబడిదారులు కాంట్రాక్ట్ గడువు ముగిసే సమయానికి లోహాన్ని డెలివరీగా తీసుకోవాలని అడగరు. ఇది ఏదో కుట్ర కాదు. దశాబ్దాలుగా ఇలాగే ఈ వ్యవస్థ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఈ వ్యవస్థకు బయట.. ముఖ్యంగా చైనాలో జరుగుతున్న పరిణామాలు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని కియోసాకి చెబుతున్నారు. చైనా కొనుగోలుదారులు కాగితపు ఒప్పందాలపై ఆసక్తి చూపకుండా నేరుగా భౌతిక వెండినే కొనుగోలు చేస్తున్నారు. వెండి బార్లు, జాబితాలో ఉన్న సరఫరా, డెలివరీ చేయగల స్టాక్ను వారు ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. అంతేకాదు, భౌతిక వెండిని పొందేందుకు పాశ్చాత్య స్పాట్ ధరల కంటే ఔన్సుకు 10 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రీమియం చెల్లించేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.
దీని ఫలితంగా ఒకే లోహానికి రెండు వేర్వేరు ధరలు ఏర్పడ్డాయి. ఒకటి కాగితపు మార్కెట్లో కనిపించే ధర కాగా.. మరొకటి భౌతిక మార్కెట్లో ఉన్న నిజమైన ధర. వెండి నిజంగా సమృద్ధిగా లభ్యమై ఉంటే, ఈ ధరల మధ్య తేడా ఆర్బిట్రేజ్ ద్వారా తక్షణమే తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడుతున్నారు. కానీ అలా జరగకపోవడం వెండి లభ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన అంటున్నారు.
ఈ ధరల ప్రీమియం పెరగడానికి కారణంగా పారిశ్రామిక రంగం నుంచి పెరుగుతున్న డిమాండ్, భూమిపై పరిమితమైన వెండి నిల్వలు, అలాగే భౌతిక సరఫరా కఠినంగా మారడం ముఖ్యమైన అంశాలుగా కియోసాకి సూచిస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లు అపరిమితంగా క్లెయిమ్లను సృష్టించగలిగినా, గనులు అవసరమైనప్పుడు లోహాన్ని ఉత్పత్తి చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది వెండి ధరలు ఎక్కడికి వెళ్తాయనే అంచనా కాదని.. వ్యవస్థలో పెరుగుతున్న ఒత్తిడిని అర్థం చేసుకోవడమే తన ఉద్దేశమని కియోసాకి స్పష్టం చేశారు. నిరంతర ప్రీమియంలు, డెలివరీపై ఆందోళనలు, ప్రాంతీయ ధరల వ్యత్యాసాలు వంటి సంకేతాలు ఈ ఒత్తిడిని క్రమంగా బయటపెడుతున్నాయని ఆయన అంటున్నారు. చరిత్రను చూస్తే, భౌతిక మార్కెట్లు కాగితపు ధరల నుంచి విడిపోయినప్పుడు జరిగే సర్దుబాట్లు ఎప్పుడూ సులభంగా ఉండవని ఆయన గుర్తుచేస్తున్నారు. రెండు ధరలు ఉన్నప్పుడు, వాస్తవికతతో ముడిపడి ఉన్నదానినే నమ్మాలని చెబుతూ, వెండి ధర తిరిగి నిర్ణయించబడే ముందు నిశ్శబ్దంగా కనిపించకుండా పోవచ్చని ఆయన హెచ్చరించారు.


Click it and Unblock the Notifications