యుద్ధం సమయంలో ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెట్టండి.. కీలక సూచన చేస్తున్న రాబర్ట్ కియోసాకి..
అంతర్జాతీయంగా తీవ్రతరం అవుతున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలకు తీవ్ర ఆర్థిక భారాన్ని, ఆందోళనను మిగుల్చుతుండగా, కొన్ని నిర్దిష్ట రంగాలు, పెట్టుబడిదారులకు మాత్రం విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతున్నాయని ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. యుద్ధాలు, ద్రవ్యోల్బణం, కమోడిటీల మధ్య ఉన్న సంబంధాన్ని క్షుణ్ణంగా విశ్లేషించారు.
చరిత్రలోని దాదాపు ప్రతి పెద్ద సంక్షోభం లేదా యుద్ధం కొంతమందిని కోటీశ్వరులుగా మార్చిందని కియోసాకి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా చమురు, రక్షణ రంగాలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన వివరించారు. యుద్ధం వల్ల ఇంధన సరఫరా వ్యవస్థలు దెబ్బతిని చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. దీనికి ఉదాహరణగా షెల్ కంపెనీ 2026 తొలి త్రైమాసికంలో ఏకంగా 6.9 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జించడాన్ని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఆయుధ నిల్వలను పెంచుకునే క్రమంలో లాక్హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, బోయింగ్, నార్త్రోప్ గ్రమ్మన్ వంటి రక్షణ రంగ సంస్థలకు భారీ ఆర్డర్లు లభిస్తున్నాయని వెల్లడించారు.

గతంలో జరిగిన మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలు, వియత్నాం, గల్ఫ్, ఉక్రెయిన్, ఇటీవల ఇరాన్ యుద్ధాల కారణంగా కమోడిటీలు, రియల్ ఆస్తులను కలిగి ఉన్న పెట్టుబడిదారులు భారీగా లాభపడినట్లు కియోసాకి వెల్లడించారు. అయితే ఈ ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, విద్యుత్, రవాణా, ఆహార ధాన్యాల ధరలు పెరిగి సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవన వ్యయం తలకిందులవుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
సంక్షోభ సమయాల్లో డబ్బు ఏ దిశగా ప్రవహిస్తుందో గుర్తించడం చాలా ముఖ్యమని కియోసాకి అన్నారు. తన 'రిచ్ డాడ్' తనకు దశాబ్దాల క్రితమే ఈ విషయాన్ని వివరించారని తెలిపారు. ప్రతి సంక్షోభంలో ట్రేడ్లో సరైన వైపు ఎవరు ఉన్నారో గుర్తించాలని, ఆ తర్వాత తాము ఏ వైపు ఉన్నామో ప్రశ్నించుకోవాలని సూచించారు. ముఖ్యంగా డిఫెన్స్, ఎనర్జీ, కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ వంటి రంగాలు భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తాయి. అయితే యుద్ధ పరిస్థితుల్లో వచ్చే లాభాలను మాత్రమే చూస్తూ పెట్టుబడులు పెట్టడం అధిక రిస్క్తో కూడుకున్నదని గుర్తుంచుకోవాలని తెలిపారు.
యుద్ధాలు కేవలం భౌగోళిక, రాజకీయ పరిణామాలకే పరిమితం కావని కియోసాకి పేర్కొన్నారు. చమురు, కమోడిటీలు, సరఫరా వ్యవస్థలు, కరెన్సీలు, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లపై కూడా వాటి ప్రభావం ఉంటుందని వివరించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టే ముందు నష్టభయం, మార్కెట్ అస్థిరత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఏదేమైనా సంక్షోభ సమయాల్లో ధనం ఏ దిశగా మళ్లుతోందో సరిగ్గా గమనించి మార్కెట్లో సరైన వైపు నిలబడటమే వివేకమని తన 'రిచ్ డాడ్' అందించిన సూత్రాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ యుద్ధ వాతావరణంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతాయి కాబట్టి పెట్టుబడిదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
