సామాన్యుడు ముందు ముందు బతకడమే కష్టం.. అన్నీ అప్పులే కనిపిస్తాయి.. ఇది ఒక్కటే కాపాడుతుందంటున్న రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండిపై తనకున్న గట్టి నమ్మకాన్ని మరోసారి వెల్లడించారు. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వాతావరణం రోజురోజుకూ క్షీణిస్తుండటం, వివిధ దేశాల ప్రభుత్వాల అప్పులు విపరీతంగా పెరిగిపోతుండటంతో, విలువైన లోహాలు ఒక సుదీర్ఘమైన భారీ బుల్ రన్ (ర్యాలీ) అంచున ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్లు Robert Kiyosaki వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. బంగారం ధరలు మరికొంత కాలం పాటు భారీగా పెరగబోతున్నాయని భావిస్తూ తాను మరింత బంగారం, వెండిని కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు కియోసాకి సోషల్ మీడియా వేదిక 'X' లో ప్రకటించారు.
ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ.. సమీప భవిష్యత్తులో బంగారం ధర ఏకంగా ఔన్సుకు 35 వేల డాలర్ల మార్కును తాకవచ్చని కియోసాకి పేర్కొన్నారు. పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు, ఫియట్ కరెన్సీల (కాగితపు కరెన్సీ) మితిమీరిన ముద్రణ వల్ల కాలక్రమేణా సామాన్యుడి కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించిపోతుందని ఆయన హెచ్చరించారు. గతంలో 2000వ సంవత్సరంలో బంగారం ర్యాలీ ప్రారంభమైన కొత్తలో.. తాను ఔన్సుకు సుమారు $300 చొప్పున కొనుగోలు చేసి నిల్వ చేయడం ప్రారంభించానని ఆయన తన అనుచరులకు గుర్తు చేశారు. ఆర్థికంగా 2026 నాటి నేపథ్యం మరింత బలహీనపడిందని, ప్రపంచ అప్పులు "పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక భారీ బెలూన్" లాంటివని.. అందుకే ప్రస్తుత ధరల్లో బంగారం కొనుగోలు చేయడం ఎంతో ఆకర్షణీయమైన అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

దిగ్గజ బ్యాంకర్ జేపీ మోర్గాన్ చెప్పిన "బంగారం మాత్రమే నిజమైన డబ్బు, మిగతాదంతా కేవలం అప్పు (క్రెడిట్)" అనే సూక్తిని ఉదహరిస్తూ అమెరికన్ డాలర్ అనేది కూడా ఒక రకమైన అప్పేనని కియోసాకి విమర్శించారు. కేవలం అంచనాలపైనే ఆధారపడకుండా పెట్టుబడిదారులు ఎవరికి వారు స్వంతంగా పరిశోధన (Research) చేసి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులను తీసుకువస్తున్న తరుణంలో నిరంతరం అధ్యయనం చేస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరమన్నారు. తన మార్కెట్ అంచనాలు ఎల్లప్పుడూ వంద శాతం నిజం కాకపోవచ్చని అంగీకరిస్తూనే, తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయాల్లో భౌతిక విలువైన లోహాలు మరియు బిట్కాయిన్ వంటి ఆస్తులు మాత్రమే సంపదను రక్షించే నిజమైన నిధులుగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు.
రాబర్ట్ కియోసాకి దీర్ఘకాలికంగా భారీ లాభాలను అంచనా వేస్తున్నప్పటికీ.. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో బలమైన అమెరికా డాలర్ మరియు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఉంచవచ్చనే అంచనాలు బులియన్ మార్కెట్పై తీవ్ర ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. దీనివల్ల బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో వారం కూడా క్షీణతను నమోదు చేశాయి.
తాజా ట్రేడింగ్ గణాంకాల ప్రకారం స్పాట్ బంగారం ధర 0.9 శాతం తగ్గి ఔన్సుకు $3,991.49 వద్దకు చేరగా, ఆగస్టు డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి $4,007.30 వద్ద ముగిశాయి. అలాగే స్పాట్ వెండి ధర 3.2 శాతం పడిపోయి ఔన్సుకు $56.01 వద్దకు చేరింది. ఈ వారం ప్రారంభంలోనే బంగారం ధర నవంబర్ 2025 తర్వాత మొదటిసారిగా అత్యంత కీలకమైన $4,000 మార్కు కంటే దిగువకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి 29న నమోదైన ఆల్టైమ్ రికార్డు గరిష్ట స్థాయి $5,594.82 డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర దాదాపు 29 శాతం పతనమై, ఈ ఒక్క వారంలోనే సుమారు 4 శాతం నష్టాన్ని మూటగట్టుకుంది. భవిష్యత్తులో ఈ ఒడిదుడుకులు ఇలాగే కొనసాగినా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రం ఇది ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
