NREGA: డిమాండ్ దిశగా ఉపాధిహామీ.. అదనపు నిధుల కేటాయింపు
NREGA: జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ప్రస్తుతం రూరల్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. మరో విధంగా చెప్పాలంటే.. పెరుగుతున్న గ్రామీణ నిరుద్యోగానికి ఈ డిమాండ్ను పరోక్ష రూపంగా చూడవచ్చు. మరో కొన్ని వారాలు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముగిసిన డిశంబర్లో ఈ డిమాండ్ 6 నెలలు గరిష్టానికి చేరగా.. జవవరిలోనూ కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి పది రోజుల్లోనే 11.1 మిలియన్ కుటుంబాలు ఈ స్కీమ్ ద్వారా ఉపాధిని పొందారు. 2022 జూన్లో 32 మిలియన్లుగా ఉన్న డిమాండ్.. ఆగస్టు నాటికి సగానికి తగ్గింది. కానీ తాజాగా మరోసారి ఊపందుకుంటోంది.
డిమాండ్ తగిన స్థాయిలో ఉపాధి కల్పన జరగడం లేదని నివేదికలు చెబుతున్నాయి. కరోనా, రూరల్ నిరుద్యోగిత, వేతనాల పెంపుల్లో మందగమనం వెరసి ఉపాధి హామీ పథకం వైపు ప్రజలు చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) లెక్కల ప్రకారం.. డిసెంబర్లో గ్రామీణ నిరుద్యోగం 7.4 శాతం ఉండగా దేశీయ నిరుద్యోగిత రేటు 8.3 శాతం ఉంది. జనవరి 10 నాటికి 7.3 నమోదయింది.
సీజన్ ఆధారరంగా ఉపాధి హామీ పథకం డిమాండ్ మారుతూ ఉంటుందని 'డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ' వైస్ ఛైర్మన్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు. జనవరి - ఫిబ్రవరి మధ్య వ్యవసాయ పనులకు అధిక డిమాండ్ ఏర్పడటం ఈ పథకాన్ని తీవ్రంగా ప్రభావం చూపుతుందని ఆయన భావిస్తున్నానన్నారు. తద్వారా రానున్న రోజుల్లో డిమాండ్ తగ్గుతుందని విశ్లేషించారు.
ఈ ఏడాది ఆరంభం నుంచి లబ్ధిదారుల హాజరు ట్రాకింగ్ కోసం అమల్లోకి తీసుకువచ్చిన 'నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం' సైతం.. ఈ పథకం డిమాండ్పై ప్రభావం చూపుతుంది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 16,400 కోట్లు అదనంగా ఈ పథకం కోసం వెచ్చించనున్నట్లు వెల్లడించింది. గ్రామీణ పేదలకు కనీసం వంద రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధిని అందించాలనే ఉద్ధేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తద్వారా జీవనోపాధితో పాటు వారికి ఆహార భద్రతపై భరోసా కల్పించినట్లవుతోంది.