2 వారాల్లో పద్నాలుగు శాతం పెరిగిన రిలయన్స్ షేర్ ధర
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గత రెండు వారాల్లో ఏకంగా 14 శాతం వరకు లాభపడింది. చివరి సెషన్లో రూ.54 లేదా దాదాపు 2 శాతం లాభపడిన ఈ స్టాక్ రూ.2778 వద్ద ముగిసింది. శుక్రవారం ఓ సమయంలో 3 శాతం లాభపడి రూ.2816ను కూడా చేరుకున్నాయి. అయితే రెండు వారాల్లోనే డబుల్ డిజిట్ లాభాలతో అదరగొట్టింది. మొత్తానికి 52 వారాల గరిష్టం రూ.2855 (ఏప్రిల్ 24, 2022)కు కొద్ది దూరంలో ముగిసింది. రెండు వారాల్లో 14 శాతం ఎగిసిపడిన ఈ స్టాక్, 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 20 శాతం లాభపడింది.
మీడియాలో వస్తున్న వార్తల మేరకు రిలయన్స్... ఎడ్-టెక్ స్టార్టప్ లిడో లర్నింగ్స్లో ఇన్వెస్ట్ చేయనున్నదని తెలుస్తోంది. రిలయన్స్ బ్రాండ్స్ కూడా ఇటలీ ఆధారిత ప్లాస్టిక్ లెగ్నోస్ యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ - ఇండియాలో 40 శాతం వాటాను కొనుగోలు చేయవచ్చునను తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా హామ్లేస్, క్లోవియా, మిల్క్ బాస్కెట్, అర్బన్ ల్యాడర్, హాప్టిక్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం లేదా కొనుగోలు చేయడం చేస్తోంది. ఇది రిలయన్స్ స్టాక్ పైన ప్రభావం చూపుతోంది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.18.80 లక్షల కోట్లకు పైన ఉంది. రూ.19 లక్షల కోట్లకు చేరువైంది. ఈ షేర్ ధర 2778కి పైన ఉంది. రిలయన్స్ షేర్ అయిదేళ్లలో 320 శాతం, ఏడాదిలో 25 శాతం, ఆరు నెలల కాలంలో 17.5 శాతం, నెలలో 5.19 శాతం లాభపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.2856, కనిష్టం రూ.2016.