2021కి పుంజుకుంటాం.. అలా అయితేనే, ఆస్ట్రేలియా, కొరియా సూపర్! బిల్ గేట్స్
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాక్సీన్ సమర్థవంతంగా పని చేస్తే ప్రపంచంలోని ధనిక దేశాలు 2021 క్యాలెండర్ ఏడాది రెండో అర్ధ సంవత్సరానికి తిరిగి సాధారణ పరిస్థితికి చేరుకుంటాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సీన్ సాధ్యమైనంత త్వరగా వస్తే, ప్రపంచ దేశాలు దీని పంపిణీకి సిద్ధంగా ఉంటే వచ్చే ఏడాదిలో ధనిక దేశాలు పుంజుకుంటాయని జోస్యం చెప్పారు. కరోనా నుండి కాపాడగలిగే సమర్థవంతమైన వ్యాక్సీన్ అందుబాటులోకి రావాలని, పంపిణీ కూడా సక్రమంగా జరిగాలన్నారు.
తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్, బెంగళూరు టాప్, రెండో స్థానంలో హైదరాబాద్
ఏ మేరకు పని చేస్తాయో..
ప్రస్తుతం అభివృద్ది దశలో ఉన్న వ్యాక్సీన్లు ఏ మేరకు పని చేస్తాయన్నది తెలియాల్సి ఉందని బిల్ గేట్స్ అన్నారు. వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ఉత్పత్తి, పంపిణీ పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ప్రజలు టీకాను తీసుకోవడానికి తొలుత సంకోచిస్తారని, దానిని అధిగమించాల్సి ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరోనా టీకాలు అభివృద్ధి చేస్తున్నారని, ఇందులో ఏవి విజయవంతమవుతాయో ఇంకా తెలియాలని అన్నారు.
చైనా, రష్యా వ్యాక్సీన్లపై బిల్ గేట్స్
రష్యా, చైనా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్ల పైన బిల్ గేట్స్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటి వరకు వారి టీకాలు ఏవి మూడోదశకు చేరుకున్నట్లుగా ఆధారాలు లేవన్నారు. శాస్త్రీయంగా వారు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్లు కచ్చితంగా ఆమోదయోగ్యమైనవే అన్నారు. అయితే మూడో దశకు సంబంధించి సరైన సమాచారం లేదని, కాబట్టి బయటి దేశాలను ఆ టీకాలు అంతగా ఆకట్టుకోలేకపోవచ్చునని చెప్పారు. పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీలు రష్యా, చైనా వ్యాక్సీన్లపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయన్నారు. అక్కడ వ్యాక్సీన్ సమర్థవంతంగా తేలితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందన్నారు.
ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అదుర్స్
రష్యా, చైనాతో మాట్లాడుతున్నామని, వారి ట్రయల్స్ మూడో దశ గురించి సమాచారం లేదన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థులను ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలు సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లాయని బిల్ గేట్స్ అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు తెలివిగా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రభావం చూపిందన్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ఆర్థిక పరిస్థితి కంటే ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతను ఇచ్చి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.