Cyber Fraud: స్క్రీన్ షాట్లు నమ్మి రూ. 2.5 కోట్లు పోగొట్టుకున్నాడు! దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, చదువుకున్న వారు, మాజీ ప్రభుత్వ అధికారులు కూడా వీరి ట్రాప్లో పడి తమ జీవిత కాలపు సంపాదనను పోగొట్టుకుంటున్నారు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్లో ఒక రిటైర్డ్ కల్నల్ ను.. ఫోరెక్స్ ట్రేడింగ్ (Forex Trading) పేరుతో నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఆ అధికారి నుంచి ఏకంగా రూ. 2.5 కోట్లు కాజేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలేం జరిగింది?
గురుగ్రామ్ లోని చాకర్పూర్ ఫేజ్-2 నివాసి అయిన రిటైర్డ్ కల్నల్ విమల్ నారంగ్ రీసెంట్ గా ఈ మోసానికి గురయ్యారు. సాగర్ రాజ్ అనే వ్యక్తి ఆయనకు ముందే పరిచయం ఉన్నవాడు. తానొక కంపెనీ డైరెక్టర్ అని చెప్పుకున్న సాగర్ రాజ్, ఫోరెక్స్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు వస్తాయని కల్నల్ నారంగ్ను నమ్మించాడు. కేవలం కొద్ది రోజుల్లోనే పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభం వస్తుందని ఆశ చూపాడు.
నమ్మించడానికి 'స్క్రీన్ షాట్లు'
కేవలం మాటలతోనే కాకుండా.. ఇతర ఇన్వెస్టర్లకు వచ్చిన లాభాలంటూ కొన్ని నకిలీ స్క్రీన్ షాట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను సాగర్ రాజ్ చూపించాడు. దీనిని నిజమని నమ్మిన కల్నల్.. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు, ఇటీవల ఒక ప్లాట్ అమ్మగా వచ్చిన రూ. 1.5 కోట్లను కూడా ఈ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా విడతల వారీగా మొత్తం రూ. 2.5 కోట్లను నిందితుడి ఖాతాకు బదిలీ చేశారు.
బయటపడ్డ మోసం
పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు తీసుకోవాలని కల్నల్ ప్రయత్నించినప్పుడు అసలు రంగు బయటపడింది. తన అకౌంట్ నుంచి నగదు విత్డ్రా కాకపోవడంతో ఆయన సాగర్ రాజ్ ను సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే సాగర్ రాజ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయమయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల దర్యాప్తు
సెన్సిటివ్ కేసు కావడంతో గురుగ్రామ్ సెంటర్-29 పోలీసులు కేసు నమోదు చేసి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) కు అప్పగించారు. నిందితుడు సాగర్ రాజ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడని, అక్కడ కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి అరెస్టయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
జాగ్రత్తగా ఉండండి
ఏది ఏమైనా.. ఇలాంటి సైబర్ ఫ్రాడ్ (Cyber Fraud) ల బారిన పడకుండా ఉండాలంటే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. ముఖ్యంగా అధిక లాభాలు వస్తాయనే ప్రకటనలను నమ్మకూడదు. ఫోరెక్స్ లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎల్లప్పుడూ సెబీ (SEBI) గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే చేయాలి. ఎవరో చూపించే స్క్రీన్ షాట్లు చూసి మీ కష్టార్జితాన్ని గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పెట్టకండి.


Click it and Unblock the Notifications


