కరోనా ఎఫెక్ట్: అన్నీ తెరుచుకుంటున్నా ... రిటైలర్లకు అమ్మకాలు లేవు!
కరోనా వైరస్ తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. చైనాలో మొదలైన మాయదారి మహమ్మారి ప్రపంచాన్ని తన విషపు కౌగిలిలో బంధించి చిత్ర హింసలు పెడుతోంది. అమెరికా నుంచి అనామక దేశం వరకు అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు కుదేలై పోవటంతో వాటిని మళ్ళీ పట్టాలు ఎక్కించేందుకు కార్యాచరణ మొదలు పెట్టాయి. అయినా సరే ఎప్పటికి గాని పరిస్థితులు చక్కబడతాయో చెప్పలేని దుస్థితి. మన దేశంలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.
ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటికే 50 లక్షల మందికి సోకింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. అలాగే ఇండియా లో కూడా 1 లక్ష మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.
దాదాపు 3 వేల మంది మరణించారు. అయితే, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ... ఇండియా లో ఇప్పటికే 2 నెలల సుదీర్ఘ లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నారు. ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చారు. జూన్ 1 నుంచి దాదాపు పూర్తిస్థాయి కార్యకలాపాలు సాగవచ్చు. కానీ ఇప్పటి వరకు వెసులుబాట్ల మధ్య నడుస్తున్న రిటైలర్లు అమ్మకాలు లేక విలవిలలాడుతున్నారు.
కరోనా కంటే ఆర్థిక సంక్షోభం గురించే ప్రజల భయాలు, ఆ రంగంలోనే 2 కోట్ల ఉద్యోగాలు ఫట్!
మూడో వంతు కూడా కష్టమే...
ప్రముఖ రిటైల్ బ్రాండ్ల దుకాణాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయి. గత వారం రోజులుగా అవన్నీకార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ కరోనా వైరస్ రాక మునుపు ఆయా స్టోర్లలో జరిగిన వ్యాపారంలో ఇప్పుడు కనీసం మూడో వంతు కూడా జరగటం లేదని వారు వాపోతున్నారు. 295 స్టోర్ల కు గాను బిగ్ బజార్ 88 స్టోర్లు, యూఎస్ పోలో, గ్యాప్, ఏరోపోస్టల్ వంటి బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫాషన్ దేశంలో 1300 స్టోర్ల కు గాను 250 ఔట్లెట్ల ను ప్రారంభించగలిగాయని వార్తలు వస్తున్నాయి.
స్టోర్లు తెలిచి ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం 50% వరకు తగ్గిపోయాయని రిటైలర్లు వాపోతున్నారు. జాక్ అండ్ జోన్స్, వేరో మోడ , ఓన్లీ వంటి బ్రాండ్లను విక్రయించే బెస్ట్ సెల్లర్ ఇండియా సీఈఓ వినీత్ గౌతమ్ కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ అమ్మకాలు 50% తగ్గినట్లు అయన ఈటీ కి వెల్లడించారు.
అందుకే కొనటం లేదు..
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు చాలా అప్రమత్తమవుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినటంతో ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. అత్యవసరమైన వస్తువులను తప్ప కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. లాక్ డౌన్ లో సడలింపులు లభించినా బయటకు వచ్చేందుకు సంకోచిస్తున్నారు.
చాలా మంది ఉద్యోగాలు పోవటం, వేతనాల్లో కోతలు పడటంతో వారి షాపింగ్ బిహేవియర్ కూడా పూర్తిగా మారిపోయింది. చాలా కేటగిరిల్లో సగటు కొనుగోలు విలువ తగ్గిపోతోంది. ఉదాహరణకు రూ 12,000 లోపు స్మార్ట్ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ కూడా వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని రిటైలర్లు పేర్కొంటున్నారు.
20% వరకు ధరల పతనం ..
ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు ఆచితూచి కొనుగోళ్లు జరుపుతున్నారని, దీంతో అమ్మకం ధరలో 15-20% తరుగుదల నమోదు అవుతోందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ ఖురానా వెల్లడించారు. కన్స్యూమర్ ఫైనాన్సింగ్ తగ్గుతుండటం కూడా దీనిని ప్రభావితం చేస్తోందని చెప్పారు.
కాగా.. ద్వితీయార్థం లో అమ్మకాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, పండుగల సీజన్లో మళ్ళీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని భారత్ లో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ దారు షావోమి ప్రతినిధి ఒకరు వెల్లడించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. కరోనా తర్వాత అమ్మకాలు బాగా దెబ్బతిన్న కేటగిరి లో ఫార్మల్ వేర్, ఫుట్ వేర్, బ్యూటీ ప్రోడక్టులు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.