రిటైల్ ఇన్వెస్టర్లను షాక్-అబ్జార్బర్స్గా పేర్కొన్న నిర్మలమ్మ
రిటైల్ ఇన్వెస్టర్లపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లకు పెద్ద అండ అని వారి కారణంగానే సజావుగా సాగుతున్నాయన్నారు. వీరిని షాక్-అబ్జార్వర్స్గా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏర్పడుతున్న కుదుపులను తగ్గించేది వారే అన్నారు. మంగళవారం కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి నిర్మలమ్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయని, ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు వాటిని శోషించుకునే షాక్-అబ్జార్బర్లుగా కనిపిస్తున్నారని తెలిపారు. ఎఫ్పీఐలు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగుతున్నాయని, కానీ మన స్టాక్ మార్కెట్ పెద్దగా ఆటుపోట్లకు గురి కాలేదన్నారు. ఇందుకు వీరే కారణన్నారు. కరోనా తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మార్కెట్లో పాల్గొనడం ఇందుకు కారణమన్నారు.
డిజిటల్ టెక్నాలజీ అంశంపై కూడా స్పందించారు. నియంత్రణ సంస్థలు డిజిటల్ టెక్నాలజీని ముందుగానే ఆకలింపు చేసుకోవాలని నిర్మలమ్మ అన్నారు. కంపెనీల వ్యాపార విధానాలు సముచితంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. మార్కెట్ల పైన డిజిటలైజేషన్ ప్రభావం తప్పకుండా ఉంటుందని తెలిపారు.