Retail inflation rate: మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్భణం, కానీ...
దేశీయ రిటైల్ ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో మళ్లీ పెరిగింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) నవంబర్ 2021లో 4.91 శాతానికి పెరిగింది. గత నెలలో సీపీఐ ఈ మేరకు నమోదైనట్లుగా జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ ద్రవ్యోల్భణం పెరిగినట్లు తెలిపింది. అక్టోబర్ నెలలో ఏడాది ప్రాతిపదికన ఇది 4.48 శాతంగా నమోదయింది. అయితే నవంబర్ 2020లో మాత్రం 6.93 శాతం నమోదయింది. ఏడాది ప్రాతిపదికన మాత్రం తక్కువే.
ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరిగినట్లు ప్రభుత్వ డేటా వెల్లడిస్తుంది. ఓవరాల్ కన్స్యూమర్ ఫ్డు ప్రైస్ ఇండెక్స్(CFPI) 1.87 శాతం పెరిగింది. అంతకుముందు నెల (అక్టోబర్)లో ఇది 0.85 శాతంగా నమోదయింది. CFPI, CPI ఆధారిత ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో గ్రామీణ ప్రాంతంలో కంటే పట్టణ ప్రాంతంలో గరిష్టంగా నమోదయింది. దీంతో పట్టణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్భణం 5.54 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో 4.29 శాతం నమోదయింది.
ఆహార ద్రవ్యోల్భణం పట్టణ ప్రాంతంలో 3.33 శాతానికి పెరగగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.09 శాతంగా నమోదయింది. అయితే వరుసగా ఐదో నెల రిటైల్ ద్రవ్యోల్భణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) టార్గెట్ 6 శాతం కంటే దిగువన ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం వరకు రిటైల్ ద్రవ్యోల్భణం పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆ తర్వాత దిగి వస్తుందని పేర్కొంది.