రిలయన్స్ కొత్త ఇంధన బిజినెస్, అయిదేళ్లలో కంపెనీ వ్యాల్యూ రూ.20 లక్షలకోట్లకు
రిలయన్స్ ఇండస్ట్రీస్ సౌర, బ్యాటరీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ వ్యాపారాలపై రాబోయే మూడేళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ కొత్త ఇంధన వ్యాపారం వ్యాల్యూ రూ.2.6 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని ప్రముఖ బ్రోకరేజీ బెర్న్స్టీన్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్కు మూడు విభాగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఆయిల్ టు కెమికల్(O2C) విభాగంలో చమురు రిఫైనరీలు, పెట్రో రసాయన ప్లాంట్లు, ఇంధన రిటైలింగ్ వ్యాపారం ఉంది. ఇక డిజిటల్ సేవల్లో టెలికం సంస్థ జియో ఉంది. రిటైల్లో ఈ-కామర్స్ కూడా కలిపి ఉంది. కొత్త ఇంధన వ్యాపారం ఇప్పుడు నాలుగో విభాగం కిందకు వస్తుంది.
సౌదీ ఆరామ్కో చైర్మన్ను రిలయన్స్ బోర్డులోకి తీసుకు వస్తున్నట్లు ఇటీవల ముఖేష్ అంబానీ ప్రకటించారు. O2C వ్యాపారానికి ఇది సానుకూల అంశంగా భావిస్తున్నారు. స్వచ్ఛ ఇంధనంపై పెట్టుబడి ప్రణాళికలను గమనిస్తే ఈ వ్యాపార వ్యాల్యూ 36 బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ.2.6 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోందని తెలిపింది. O2C వ్యాపార వ్యాల్యూ 69 బిలియన్ డాలర్లు, డిజిటల్ సేవల వ్యాపార వ్యాల్యూ 66 బిలియన్ డాలర్లు, రిటైల్ వ్యాపార వ్యాల్యూ 81.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.
అప్ స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ కార్యకలాపాల వ్యాల్యూ 4.1 బిలియన్ డాలర్లు, మీడియా, ఆతిథ్య రంగాల్లోని పెట్టుబడుల వ్యాల్యూ 3.7 బిలియన్ డాలర్లతో కలిపి మొత్తం కంపెనీ వ్యాల్యూ దాదాపు రూ.19.57 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని అంచనా. బ్యాలెన్స్ షీట్ ప్రకారం నిధుల విషయంలో రిలయన్స్కు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. FY22లో రూ.65,600 కోట్ల నగదు నిల్వలు ఉండగా FY26 నాటికి రూ.1.5 లక్షల కోట్ల నగదు నిల్వలకు చేరుకోవచ్చునని అంచనా.
ఇదిలా ఉండగా, వ్యాపార సంస్థల సమాచారం తెలిపే జస్ట్ డయల్లో మెజార్టీ వాటా 66.95 శాతం కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సిద్ధమైంది. ప్రమోటర్ల నుండి 40.95 శాతం వాటా కొనుగోలుకు శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇందుకు రూ.3,497 కోట్లు వెచ్చిస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కొనుగోలు చేస్తోన్న 40.95 శాతం వాటాలో 25.33 శాతాన్ని కంపెనీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జస్ట్ డయల్ కేటాయించనుంది.