భూమి అయిపోయింది.. ఆకాశాన్ని టార్గెట్ చేసిన అంబానీ.. జియో రోడ్ మ్యాప్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) దేశీయ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలిచిపోయింది. 524 మిలియన్ల (52.4 కోట్లు) చందాదారులతో భారతదేశపు నంబర్ 1 టెలికాం ఆపరేటర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రిలయన్స్ జియో, భవిష్యత్తు వృద్ధిని నిర్దేశించే ఐదు వ్యూహాత్మక నిబద్ధతలను ప్రకటించింది. కేవలం ఒక దశాబ్దంలోనే అసాధారణమైన కార్యాచరణ స్థాయిని సాధించామని, ఇకపై కేవలం భూతలాన్నే కాకుండా ఆకాశాన్ని కూడా అనుసంధానించడమే తమ లక్ష్యమని జియో ప్లాట్ఫామ్స్ వెల్లడించింది.
వార్షిక సమావేశంలో జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ భవిష్యత్తు రోడ్మ్యాప్ను వివరించారు. భారతదేశపు డిజిటల్ విప్లవానికి జియో ట్రూ 5జీ (True 5G) సాంకేతికతను పునాదిగా నిలపడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే 2030 నాటికి జియో చందాదారులందరినీ పూర్తిస్థాయిలో 5జీ నెట్వర్క్కు మార్చడంతో పాటు, 6జీ ప్రమాణాల అభివృద్ధిలోనూ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీనితో పాటు మిగిలిన నాలుగు అంశాల రోడ్ మ్యాప్ కూడా ఆయన వివరించారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి హై-స్పీడ్ హోమ్ బ్రాడ్బ్యాండ్ను తీసుకెళ్లడం రెండవది కాగా, దేశీయ చిన్న వ్యాపారాలు, భారీ సంస్థలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడం మూడవ లక్ష్యం. అలాగే ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా ఏఐ (AI)"ని అందుబాటులోకి తేవడం, ఇక్కడ అభివృద్ధి చేసిన అత్యాధునిక భారతీయ సాంకేతిక పరిష్కారాలను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించడం మిగిలిన వ్యూహాత్మక సూత్రాలుగా ప్రకటించారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో (FY26) జియో సాధించిన గణాంకాలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే 77 మిలియన్ల కొత్త కస్టమర్లు చేరడంతో, జియో 5జీ చందాదారుల సంఖ్య 268 మిలియన్లు దాటింది. చైనా వెలుపల ఒకే దేశంలో ఇంతపెద్ద 5జీ నెట్వర్క్ ఉన్న ఏకైక ఆపరేటర్ జియో మాత్రమే కావడం విశేషం. మొత్తం వైర్ లెస్ డేటా ట్రాఫిక్లో 5జీ వాటానే 55% గా ఉంది. అలాగే, దాదాపు 13 మిలియన్ల కనెక్షన్లతో ఉన్న 'జియో ఎయిర్ఫైబర్' (JioAirFiber) విజయంతో, గృహాలకు స్థిర వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ అందించడంలో జియో ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేటర్గా అవతరించింది.
ఈ అసాధారణ వృద్ధి ఆర్థిక ఫలితాల్లోనూ ప్రతిఫలించింది. జియో నెట్వర్క్పై మొత్తం డేటా ట్రాఫిక్ వార్షికంగా 30.8% పెరిగి 241 ఎక్సాబైట్లకు చేరింది. ఫలితంగా, జియో ప్లాట్ఫామ్స్ వార్షిక ఆదాయం 14.6% వృద్ధితో రూ. 1,46,885 కోట్లకు చేరగా, EBITDA రూ. 76,255 కోట్లు (51.9% మార్జిన్) గా నమోదైంది. అత్యంత కీలకమైన పరిణామంగా, జియో చరిత్రలోనే తొలిసారిగా వార్షిక నికర లాభం (PAT) రూ. 30,000 కోట్ల మార్కును దాటి, రూ. 214 లీడింగ్ ARPU (సగటు వినియోగదారు ఆదాయం) తో సరికొత్త రికార్డు సృష్టించింది.
జియో భారతదేశాన్ని భూమిపై అనుసంధానించింది, ఇకపై మనం ఆకాశం నుండి అనుసంధానించాలి అంటూ ఆకాష్ అంబానీ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (ఉపగ్రహ సమాచార వ్యవస్థ) రంగంలోకి జియో ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. సాంప్రదాయ మొబైల్ టవర్ల పరిధికి అందని మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి శాటిలైట్ ఇంటర్నెట్ వారధిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన 'స్టార్లింక్' ఆధిపత్యం ఉన్న ఈ విభాగంలోకి అడుగుపెడుతున్న తొలి భారతీయ కంపెనీగా జియో నిలవనుంది. ఇందుకోసం రాబోయే 2-3 ఏళ్లలో దాదాపు 650 కిలోమీటర్ల ఎత్తులో, 1,600 నుండి 1,650 ఉపగ్రహాలతో కూడిన సొంత లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ సమూహాన్ని (Constellation) నిర్మించనున్నారు.
బ్రాడ్బ్యాండ్, డైరెక్ట్-టు-డివైస్ (D2D) సేవలను అందించే ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దాదాపు 10 నుండి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. ఈ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడమే కాకుండా, అంతరిక్ష నియంత్రణ సంస్థ (IN-SPACe) కు ప్రతిపాదనలు సమర్పించి సాంకేతిక మూల్యాంకన ప్రక్రియను కూడా ప్రారంభించారు.
ఏజీఎంలో ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకున్న మరో ప్రధానాంశం జియో ఐపీఓ (IPO) ప్రకటన. జియో పబ్లిక్ ఇష్యూ కోసం రూపొందించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) కు రిలయన్స్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈరోజు సాయంత్రంలోగా దీనిని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) వద్ద దాఖలు చేయనున్నారు. ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా దాదాపు 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33,000 కోట్లకు పైగా) నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.
ఒక్కో షేరుకు రూ. 10 ముఖ విలువతో గరిష్టంగా 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను (Fresh Issue) జారీ చేయనున్నారు. ఇది గనుక మార్కెట్లోకి వస్తే.. గతంలో ఉన్న హ్యుందాయ్ మోటార్స్, ఎన్ఎస్ఈ ఐపీఓ రికార్డులను అధిగమించి, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. ఫ్రెష్ ఇష్యూ రూపంలో రానున్న ఈ నిధులు నేరుగా కంపెనీ వృద్ధి కోసమే జమ కానున్నాయి. "ప్రపంచ స్థాయి విలువ కలిగిన టెక్నాలజీ కంపెనీలను భారతదేశం నిర్మించగలదని జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుంది" అని ముఖేష్ అంబానీ అత్యంత ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఈ మెగా ప్రకటనలతో ఇంధన రంగం నుండి పూర్తిస్థాయి వినియోగదారు టెక్నాలజీ దిగ్గజంగా రిలయన్స్ రూపాంతరం చెందిందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications
