జియో మరో భారీ డీల్ : రూ.5683 కోట్లు పెట్టుబడి పెట్టిన ఏడీఐఏ
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన జియో ప్లాట్ఫామ్కి భారీ పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ(ఏడీఐఏ) జియోలో రూ.5683కోట్లు పెట్టుబడులు పెట్టింది. తాజా పెట్టుబడితో జియోలో ఏఐడీఏ 1.16శాతం వాటాను దక్కించుకుంది. భారత్లో డిజిటల్ రంగాన్ని జియోనే శాసించగలదు అన్న నమ్మకమే పెట్టుబడిదారులను దానివైపు ఆకర్షిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా ఒప్పందంపై రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ మాట్లాడుతూ... 'ప్రపంచవ్యాప్తంగా నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతూ వస్తోన్న ADIA.. భారత్లో జియో సారథ్యంలో డిజిటల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, సమగ్ర వృద్ధి అవకాశాలను సృష్టించేందుకు.. మాతో చేతులు కలపడం సంతోషంగా ఉంది.' అని పేర్కొన్నారు.
గడిచిన ఏడు వారాల్లోనే జియోలో 8 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. యాథృచ్చికంగా ఈ ఒప్పందాలన్నీ లాక్ డౌన్ పీరియడ్లోనే జరగడం గమనార్హం.జియోలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఫేస్ బుక్, విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, తదితర సంస్థలు ఉన్నాయి. ఇప్పటివరకూ జియోలో 21శాతం వాటాను రిలయన్స్ అమ్మేయగా.. అత్యధికంగా ఫేస్బుక్ 9.99శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో కేకేఆర్,విస్టా కంపెనీలు ఉన్నాయి. తద్వారా రూ.97,885.65కోట్ల పెట్టుబడిని సమకూర్చుకోగలిగింది.