జియో ‘జయహో’! మళ్లీ సత్తా చాటిన రిలయన్స్ జియో...
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ను మట్టికరిపించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి రెవెన్యూ మార్కెట్ షేర్ పరంగా ప్రథమ స్థానం కైవసం చేసుకుని తన సత్తాను చాటింది.
ట్రాయ్ వద్ద ఉన్న సమాచారం మేరకు.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి దాదాపు 24 మిలియన్ల సబ్స్క్రైబర్లు కొత్తగా జియో నెట్వర్క్లో చేరారు. దీంతో జియో కస్టమర్ మార్కెట్ షేర్ 30 శాతానికి చేరుకుంది.

దూసుకెళ్లిన జియో...
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తన రెవెన్యూ మార్కెట్ షేర్ (ఆర్ఎంఎస్)ను మరింత బలోపేతం చేసుకుంది. ఒక్క మెట్రో నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాలలోనూ బలమైన వృద్ధిని నమోదు చేసి తన సత్తాను నిరూపించుకుంది. ఫలితంగా ఈ విషయంలో జియో తన రెండో స్థానాన్ని మరింత పదిలపరుచుకుని భారతి ఎయిర్టెల్కు షాక్ ఇచ్చి టాప్లోకి దూసుకు వచ్చింది.

ట్రాయ్ వివరాల ప్రకారం...
ముకేశ్ అంబానీ నేతృత్వంలొని జియో సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన 348 బేసిస్ పాయింట్లు (బీపీఎస్)తో 35 శాతం రెవెన్యూ మార్కెట్ షేర్ను సొంతం చేసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ మేరకు ఒక నివేదికను రూపొందించింది.

ఎవరెక్కడ అంటే...
ఈ డేటా ప్రకారం భారతి ఎయిర్టెల్ (టాటా టెలిసర్వీసెస్ సహా) 32.1 శాతం రెవెన్యూ మార్కెట్ షేర్తో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్లు సాధించగా, ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతోన్న వొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో 66 బీపీఎస్, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లలో 20 సర్కిళ్లలో తన మార్కెట్ వాటాను కోల్పోయింది.

జమ్మూకశ్మీర్ ఎఫెక్ట్...
జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్, సెల్యులార్ సేవలను కేంద్రం మూసివేయడంతో ఆ ప్రభావం టెలికాం కంపెనీలపై తీవ్ర స్థాయిలో పడింది. దీంతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్లు గణనీయమైన స్థాయిలో ఖాతాదారులను కోల్పోయాయి. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వొడాఫోన్ ఐడియా నికరంగా 89 లక్షల ఖాతాదారులను కోల్పోవడంతో దాని ఖాతాదారుల సంఖ్య 32 కోట్లకు పడిపోయింది. అలాగే భారతీ ఎయిర్టెల్ కూడా 25-30 లక్షల మంది ఖాతాదారులను పోగొట్టుకుంది.

తెలంగాణలోనూ జియో హవా...
తెలంగాణలో కూడా రిలయన్స్ జియో 37 శాతం రెవెన్యూ మార్కెట్ షేర్తో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా మరింత చతికిలపడింది. ఈ ఏడాది ముగిసిన రెండో త్రైమాసికంలో తెలంగాణలో ఎయిర్టెల్ 36.5 శాతం, వొడాఫోన్ ఐడియా 20 శాతం మార్కెట్ షేర్తో సరిపెట్టుకున్నాయి.

చందాదారుల్లోనూ జియో టాప్...
ఇక చందాదారుల సంఖ్య విషయానికొస్తే.. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రిలయన్స్ జియో 24 మిలియన్ల కస్టమర్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ త్రైమాసికం ముగింపు నాటికి జియో 4జీ యూజర్ బేస్ 355.2 మిలియన్లకు చేరుకుంది. మరోవైపు ఎయిర్టెల్కు ఈ మార్కెట్ షేర్ 27.74 శాతం ఉండగా.. వొడాఫోన్ ఐడియా 31 శాతం మార్కెట్ షేర్ సాధించింది.


Click it and Unblock the Notifications