రిలయన్స్ డెబిట్ ఫ్రీ, గడువుకు ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ 58 రోజుల్లో రూ.1,68,818 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్ వాటాల విక్రయం ద్వారా రూ.1,15,693.95 కోట్లు సమీకరించింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లు వచ్చాయి. దీంతో రెండు నెలల లోపే రూ.1,68,818 కోట్లు సమీకరించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు స్పందించారు.

గడువుకు ముందే రుణరహిత కంపెనీగా
రిలయన్స్ ఇండస్ట్రీస్ను మార్చి 31, 2021 నాటికి రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దుతానని గత ఏడాది హామీ ఇచ్చామని, దీనిని గడువుకు ముందే నెరవేర్చామని ముఖేష్ అంబానీ అన్నారు. తక్కువ సమయంలోనే ప్రపంచ దిగ్గజ కంపెనీల నుండి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కరోనా వైరస్ వంటి మహమ్మారి సమయంలో ఈ పెట్టుబడులు సాధించామన్నారు. వీటితో పాటు బ్రిటిష్ పెట్రోలియం (BP)తో పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్ ద్వారా వచ్చిన వాటాతో ఇది రూ.1.75 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.

వరుసగా పెట్టుబడులు
మార్చి 31, 2021 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ను రుణరహిత కంపెనీగా చేస్తామని గత ఏడాది ఏజీఎం సమావేశంలో షేర్హోల్డర్లకు ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. రిలయన్స్ డెబిట్స్ అప్పటికి రూ.1,61,035 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో, రిలయన్స్ రీటైల్ లిస్టింగ్ గురించి కూడా ప్రస్తావించారు. జియోలోకి ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటింక్, కేకేఆర్, ముబాదాల, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కాటర్టన్, సౌదీకి చెందిన పీఐఎఫ్లు వాటాలు కొనుగోలు చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఫేస్బుక్ కొనుగోలుతో ఇది ప్రారంభమైంది.

దేశ శ్రేయస్సు కోసం..
వాటాదారుల అంచనాలకు మించి ముందుగానే, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రిలయన్స్ రుణరహిత సంస్థగా ఏర్పడటంతో పాటు కంపెనీకి ఇది సువర్ణ అధ్యాయం లిఖిస్తోందని అన్నారు. భారతదేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని, ధీరూబాయ్ అంబానీ కలలు నెరవేరుస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications