Reliance: దేశంలోకి కొత్త ఉత్పత్తిని తెస్తున్న రిలయన్స్.. మార్కెట్ లీడర్గా ఎదిగేందుకు..
Reliance: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని త్రైమాసికాలుగా విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అనేక కంపెనీల్లో వాటాల కొనుగోళ్లు, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, సొంత బ్రాండ్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తోంది.
ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కు చెంది ఎఫ్ఎంసీజీ విభాగం, దాని పూర్తి యాజమాన్యంలోని అనుబంధ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దేశంలోకి ప్రసిద్ధ కార్న్ చిప్స్ స్నాక్స్ అలన్స్ బగ్ల్స్ను తీసుకొస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ స్నాక్స్ ఇప్పటికే యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచి ఆదరణ కలిగి ఉంది. తాజా నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ విదేశీ స్నాక్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది.
అలన్స్ బగ్ల్స్ బ్రాండ్ మార్కెట్లో 50 ఏళ్లకు పైగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. జనరల్ మిల్స్ యాజమాన్యంలో పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీతో పాటు పిల్స్బరీ, బెట్టీ క్రోకర్, నేచర్ వ్యాలీ, హాగెన్-డాజ్, చీరియోస్, ఓల్డ్ ఎల్ పాసో, అన్నీస్, వాంచై ఫెర్రీ వంటి మరిన్ని ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. "ఆకాంక్షగల భారతీయులు" ప్రీమియం ఆఫర్లను రుచి చూడాలని, ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు రిలయన్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఎఫ్ఎమ్సీజీ పాదముద్రను విస్తరించాలని అంబానీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
భారత వినియోగదారుల కోసం ఈ చిప్స్ కేవలం రూ.10 ప్యాకేజీ నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఒరిజినల్ (సాల్టెడ్), టొమాటో అండ్ చీజ్ వంటి ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. జనరల్ మిల్స్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటైన బగ్ల్స్ను కలిగి ఉన్నందుకు థ్రిల్గా ఉందని ఫైనాన్స్ డైరెక్టర్ శేషాద్రి సవాల్గి అభిప్రాయపడ్డారు.
ఈ చిప్ల విడుదల ముందుగా కేరళ నుంచి మొదలై క్రమంగా దేశమంతటా విస్తరించనుంది. ఇప్పటికే RCPL FMCG పోర్ట్ఫోలియోలో Campa, Sosyo, Raskik వంటి కంపెనీలను కలిగి ఉంది. వీటికి తోడు ఇటీవల కంపెనీ లోటస్ చాక్లెట్స్ కంపెనీలో 51 శాతం వాటాలను సొంతం చేసుకుంది. అలాగే ఇతర విభాగాల్లోనూ మరిన్ని కంపెనీలను కలిగి ఉంది.