Reliance Intelligence: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంస్థ ప్రధానంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత మౌలిక సదుపాయాలు, సేవలు, పరిష్కారాల అభివృద్ధిపై దృష్టి సారించనుందని జియో అధినేత తెలిపారు.
ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే రిలయన్స్ డీప్-టెక్ ఎంటర్ప్రైజ్గా రూపాంతరం చెందడానికి కేంద్రంగా ఉంది. ఈ దిశలో మరింత వేగం, దృష్టిని తెచ్చేందుకు రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏర్పాటును ప్రకటించడం నాకు గర్వకారణమని అన్నారు. ఈ ప్రకటనతో భారతదేశ AI ప్రయాణంలో రిలయన్స్ మరో కీలక దశను ప్రారంభించినట్లేనని చెప్పవచ్చు.
రిలయన్స్ ఇంటెలిజెన్స్ ప్రధాన లక్ష్యం భారతదేశానికి తదుపరి తరం AI మౌలిక సదుపాయాలను కల్పించడమని జియో అధినేత అన్నారు. ఈ క్రమంలో కంపెనీ గిగావాట్-స్కేల్, AI-రెడీ డేటా సెంటర్లు నిర్మించనుంది. ఇవి పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో శక్తిని పొందుతాయి. గుజరాత్లోని జామ్నగర్ లో ఈ డేటా సెంటర్లపై ఇప్పటికే పని ప్రారంభమైంది. ఇవి దశలవారీగా అందుబాటులోకి వచ్చి భారతదేశంలో పెరుగుతున్న AI అవసరాలను తీర్చనున్నాయి.

AI ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇంటెలిజెన్స్.. గూగుల్, మెటా వంటి అమెరికా టెక్ దిగ్గజాలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. అలాగే, ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలను కూడా కలుపుకుంటూ.. భారతదేశంలో AI పనితీరు నాయకత్వంను నిర్మించడానికి దోహదం చేయనుంది.ఈ భాగస్వామ్యాలు భారతీయ అవసరాలకు సరిపోయే India-first AI పరిష్కారాలను అందించడానికి సహాయపడనున్నాయి.
రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యం కేవలం టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాకుండా.. వినియోగదారులు, చిన్న వ్యాపారాలు, సంస్థలు అందరికీ ఉపయోగించడానికి సులభమైన AI సేవలు అందించడమేనని అంబానీ అన్నారు. ప్రత్యేకంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన రంగాలకు ఆధునిక AI పరిష్కారాలను అందించనుంది. దీని వలన గ్రామీణ ప్రాంతాల వరకు డిజిటల్ శక్తిని విస్తరించే అవకాశం ఉంది.
భారతదేశానికి AIలో ప్రతిభను పెంపొందించడం కూడా ఈ కొత్త సంస్థ ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా జియో అధినేత అన్నారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచ స్థాయి పరిశోధకులు, ఇంజనీర్లు, డిజైనర్లు, ఉత్పత్తి బిల్డర్లు కలిసి పనిచేసే ఒక ఇంటిని సృష్టిస్తుంది. ఇక్కడ పరిశోధన వేగాన్ని, ఇంజనీరింగ్ కఠినతను మిళితం చేసి, ఆలోచనలను నూతన ఉత్పత్తులుగా, అనువర్తనాలుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా, రిలయన్స్ ఇంటెలిజెన్స్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా పరిష్కారాలను అందించనుంది.
అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇంటెలిజెన్స్ భారతదేశ డిజిటల్ భవిష్యత్తును మార్చబోతోంది. మేము కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సులభంగా అందుబాటులో ఉండే AI సేవలను అందించాలనుకుంటున్నామని చెప్పారు. AI కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా, ప్రతి భారతీయుడి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపనుందని తెలిపారు.


Click it and Unblock the Notifications